తెలంగాణలో 4ఏళ్లలో 3లక్షల ఉద్యోగాలు, హైదరాబాద్ నుంచి అమెరికాకు ఆ కంప్యూటర్
హైదరాబాద్: తెలంగాణవాసులకు శుభవార్త! ఎలక్ట్రానిక్ పరిశ్రమలో రానున్న నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం తెలంగాణకు మూడో ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను మంజూరు చేయాలని సంబంధిత కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్కు లేఖ రాసినట్లు తెలిపారు. సోమవారం రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించారు.
దేశంలో తొలిసారి.. జగన్ కొత్త స్కీం: వారికి రోజుకు రూ.225: రాకుంటే ఇలా చేయండి!
రెండో కేంద్రం భాగ్యనగరంలో..
అగ్రశ్రేణి సంస్థ అయిన ఇంటెల్ హైదరాబాదులో తన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇంటెల్ భారత్లో తన రెండో సెంటర్ను భాగ్యనగరానికి తీసుకు వచ్చింది. మొత్తం 3 లక్షల చదరపు అడుగులు, 6 అంతస్తుల్లో ఈ సెంటర్ను నిర్మించారు. ఇందులో 1500 మంది ఉద్యోగులు పని చేయనున్నారు. ఇందులో ఇంటెల్ ఇండియా మేకర్స్ ల్యాబ్ ఉంటుందని ఇంటెల్ కంట్రీ హెడ్, డేటా సెంటర్ గ్రూప్ ఉపాధ్యక్షురాలు నివృత్తి రాయ్ తెలిపారు.
ఇంటెల్ కార్యకలాపాలు మరింత పెరుగుతాయి
ఇరవై ఏళ్లుగా భారత్లో పరిశోధన కార్యకలాపాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ వచ్చినట్లు, తద్వారా సాంకేతిక రంగం విస్తరణల భాగస్వామి అయినట్లు తెలిపారు. మేకర్ ల్యాబ్ ద్వారా హార్డ్ వేర్ అండ్ సిస్టమ్స్ విభాగాల్లోని అంకుర సంస్థలకు ఇంక్యుబేషన్ మద్దతు లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఇంటెల్ కార్యకలాపాలు మరింత పెరుగుతాయన్నారు.
అమెరికాకు ఎక్సా స్కేల్ ఆఫ్ కంప్యూటర్
ప్రపంచ కంప్యూటర్ రంగంలో కొత్త అధ్యాయంగా భావించే ఎక్సా స్కేల్ ఆఫ్ కంప్యూటర్ను హైదరాబాద్ ఇంటెల్ సెంటర్లో తయారు చేయనున్నారు. 2021 నాటికి అమెరికాకు ఈ కంప్యూటర్ను సరఫరా చేయనున్నట్లు ఇంటెల్ సీనియర్ ఉపాధ్యక్షులు కొడూరి రాజా తెలిపారు. 2022 నాటికి దీనిని భారతదేశంలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందులో అనేక ప్రత్యేకతలు, సరికొత్త టెక్నాలజీ ఉంటుందని చెప్పారు.
అయిదేళ్లలో ఇవి వచ్చాయి..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఎన్నో అంతర్జాతీ సంస్థలు ఇక్కడ తమ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. గత అయిదేళ్లలో గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, క్వాల్కామ్, మైక్రాన్, అమెజాన్, ఉబెర్, ఒప్పో వంటి ప్రాజెక్టులు వచ్చాయని, డెల్లాయిట్ తన కార్యకలాపాలు విస్తరిస్తోందన్నారు. ఇప్పుడు ఇంటెల్ వచ్చిందన్నారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ రంగం ద్వారా 60 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ రంగంలో చైనాకు చెందిన స్కైవర్త్ 50 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేవలం ఐటీకే పరిమితం కాకుండా ఐటీ ప్రోడక్ట్స్ రూపొందించడం, డిజైన్ అండ్ డెవలప్మెంట్, సెమీ కండక్టర్, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
వీటితో 30,000 ఉద్యోగాలు వచ్చాయి
ఎలక్ట్రానిక్స్ తయారీనీ ప్రాధాన్యతారంగంగా చూస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో ఇప్పటికే రూ.5000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, తద్వారా 30,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇటీవలే చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హైదరాబాదులో 50 ఎకరాల్లో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఇప్పటికే రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఉన్నాయని, మూడోది అవసరమని, అందుకే కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్కు లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.