మందగమనంలోనూ జీఎస్టీ కలెక్షన్లలో తెలంగాణ రికార్డ్, భారీ లక్ష్యం దిశగా..
జీఎస్టీ పన్ను రాబడిలో తెలంగాణ రాష్ట్రం మిగతా దక్షిణాది రాష్ట్రాల కంటే ముందు నిలిచింది. ప్రత్యేక యాప్, స్పెషల్ డ్రైవ్లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి మార్గదర్శకంగా నిలుస్తోంది. దేశంలో జీఎస్టీ వసూళ్లు తగ్గినా తెలంగాణలో మాత్రం పెరగడం గమనార్హం. గత ఏడాది కంటే వృద్ధిరేటు తగ్గినప్పటికీ వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా లక్ష్యాన్ని మించి ఖజానాకు రాబడి వస్తోంది.
రూ.2,000 కథ ముగిసినట్లే? ATMలో క్యాసెట్ తొలగింత, బ్యాంకుల ప్రకటన!
బడ్జెట్ అంచనా లక్ష్యాల్లో 86 శాతం
దక్షిణాది రాష్ట్రాలలో జీఎస్టీ రాబడిలో తెలంగాణ ముందు నిలిచింది. 2019-20 వార్షిక బడ్జెట్లో వాణిజ్య పన్నులు, జీఎస్టీ ద్వారా రూ.47వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేయగా, ఈసారి ఈ అంచనాలను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే రూ.40,268 కోట్లు వసూలు అయ్యాయి. బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఇది 86 శాతం.
భారీ వసూళ్లు..
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే 6.35 శాతం వృద్ధి రేటు నమోదయింది. గత 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.45,379 కోట్ల రాబడి వచ్చింది. 15.37% వృద్ధిరేటు నమోదైంది. ఈసారి ప్రతికూల పరిస్థితుల్లోను మంచి కలెక్షన్లు వస్తాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.48 వేల కోట్ల నుంచి రూ.50 వేలకోట్ల రాబడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
వసూళ్లే కాదు.. బకాయిలూ..
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల రోజులు దాటి మరో నాలుగైదు రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో బకాయిలతో పాటు పన్నుల రూపంలో రూ.8,000 కోట్ల నుండి రూ.10,000 కోట్ల వరకు వసూలు అవుతాయని అంచనా. పన్నుల వసూలు మాత్రమే కాకుండా ఎగవేతలు అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.