ఆప్షన్ 1కు ఓకే: జీఎస్టీ పరిహారం సెస్, ఆంధ్రప్రదేశ్ దారిలోనే తెలంగాణ
హైదరాబాద్: జీఎస్టీ పరిహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఆప్షన్ను ఎంచుకుంది. ఈ మేరకు కేందర ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జీఎస్టీ పరిహారం కింద రూ.2,380 కోట్లు వస్తాయి. ఆప్షన్ 1 ఎంచుకున్న రాష్ట్రాలకు FRBMలో ఇచ్చిన సడలింపుల వల్ల బహిరంగ మార్కెట్ నుండి అదనంగా రూ.5,017 కోట్ల రుణం తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఆప్షన్ వన్ ఎంచుకున్న రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు 23 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాయి. తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా గత నెలలో ఆప్షన్ 1ను ఎంచుకుంది.
2022 తర్వాత జీఎస్టీ పరిహార సెస్: ఆప్షన్ 1కు ఆంధ్రప్రదేశ్ ఓకే, తిరస్కరించిన తెలంగాణ
తెలుగు రాష్ట్రాలు ఇదే ఆప్షన్
జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు వార్షిక వృద్ధి రేటు 14 శాతం కంటే ఎంత తగ్గితే ఆ మేరకు 2022 వరకు కేంద్రం పరిహారం ఇవ్వాలి. ఈ ఏడాది కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో వ్యాపారాలు స్తంబించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం భారీగా తగ్గింది. ఈ అంశానికి సంబంధించి ఆగస్ట్ 27న జీఎస్టీ కౌన్సిల్ చర్చించి రాష్ట్రాలకు రెండు ఆప్షన్లు ఇచ్చింది.
ఇందులో జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన నష్టాన్ని లెక్కించి ఆప్షన్ 1గా, జీఎస్టీ, కరోనా వల్ల వ్యాపారాలు స్తంభించి ఏర్పడిన నష్టాన్ని ఆప్షన్ 2గా రాష్ట్రాలకు ఇస్తారు. పలు రాష్ట్రాలు ఆప్షన్ 1ను ఎంచుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే ఆప్షన్ను ఎంచుకున్నాయి.
కేంద్రం చెల్లిస్తుంది
ఆప్షన్ 1 కింద రాష్ట్రాలకు ఆదాయ క్షీణతను గతంలో రూ.97వేల కోట్లుగా అంచనా వేయగా, రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేయాలన్న రాష్ట్రాల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. ఈ ఆప్షన్ కింద తీసుకున్న రుణాలపై వడ్డీని అయిదేళ్ల తర్వాత వసూలు చేసే సెస్ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం.
ఈ ఆప్షన్ 1కి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖడ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ అంగీకరించాయి. ఈ మొత్తాన్ని ఆర్బీఐ నుండి రుణంగా తీసుకొని రాష్ట్రాలకు పరిహారం కింద అందిస్తుంది కేంద్రం. రుణంపై వడ్డీని రాష్ట్రాలు చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్టీలో పరిహారం సెస్ కింద వసూలు చేసే మొత్తం దానిని కేంద్రమే చెల్లిస్తుంది.
ఆప్షన్ 2 ఎంచుకుంటే..
కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. రూ.2.35 లక్షల కోట్ల మేర రాష్ట్రాలకు నష్టం ఉంటుందని అంచనా. ఆప్షన్ 2ని ఎంచుకున్న రాష్ట్రాలు తామే స్వయంగా మార్కెట్ నుండి రుణాలు సేకరించుకోవచ్చు. అలా మార్కెట్ నుండి తెచ్చుకున్న రుణం, వడ్డీని జీఎస్టీ సెస్సు నుండి కేంద్రం చెల్లిస్తుంది.
మొదటి ఆప్షన్ ఎంచుకున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన 2 శాతం అదనపు రుణంలో షరతులు లేకుండా 0.5 శాతం మేర మార్కెట్ నుండి రుణం తీసుకోవడానికి అనుమతిస్తుంది కేంద్రం. ఆప్షన్ 2 ఎంచుకుంటే కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు అమలు చేయాలి.