రూ.30 వరకు పెరిగిన బీరు ధర, మద్యం రూ.80 హైక్: ఆదాయం ఎంత పెరుగుతుందంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు ఉన్న ధరల కంటే అన్ని రకాల బ్రాండ్స్ పైన 20 శాతం పెరిగింది. ఈ ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. ధరల పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరగనుంది.
FASTag ఉంది కానీ.. టోల్ గేట్ల వద్ద బారులుతీరిన వాహనాలు
ఆదాయం ఎంత పెరుగుతుందంటే
గత అక్టోబర్ నుంచి కొత్త ఆబ్కారీ విధానం అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.935 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెరిగాయి. దీంతో మరో రూ.4వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుంది.
బ్రాండ్స్, బీరుపై ధర పెరుగుదల ఇలా...
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని రకాల బ్రాండ్స్లో క్వార్టర్ బాటిల్ పైన రూ.20, హాఫ్ బాటిల్ పైన రూ.40, ఫుల్ బాటిల్ పైన రూ.80 చొప్పున, విదేశీ మద్యం సీసాపై రూ.150 వంతున ధర పెరిగింది. ఇక లైట్ బీరుపై సీసా ఒక్కటికి రూ.20, స్ట్రాంగ్ బీరుపై రూ.10 పెంచారు.
అప్పుడే కొత్త ఎమ్మార్పీ ధరలు..
కొత్త ధరలు అమలు చేయాలనే ఉద్దేశ్యంతో డిపోల నుంచి దుకాణాలకు సరకు సరఫరాను నిలిపివేశారు. పెంపుదల నిర్ణయం నేపథ్యంలో మంగళవారం నుంచి సరఫరాను పునరుద్ధరించనున్నారు. ఇప్పుడు ఉన్న మద్యాన్ని దుకాణాల యజమానులు పాత ధరకే అమ్మవలసి ఉంటుంది. కొత్త ఎమ్మార్పీ ధరలు ముద్రించినవి అందుబాటులోకి వచ్చాకే దాని ప్రకారం అమ్మకాలు సాగించాల్సి ఉంటుంది.
లైట్ బీర్పై డబుల్ షాక్
మద్యం పరిమాణాన్ని బట్టి రూ.20 నుంచి రూ.80 వరకు పెరిగింది. బీరు ప్రియులు మాత్రం ఒక్కో సీసాపై రూ.10 నుంచి రూ.20 వరకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లైట్ బీర్ ఇష్టపడేవారికి రూ.20తో డబుల్ షాక్ కాగా, స్ట్రాంగ్ బీర్ ఇష్టపడేవారికి రూ.10 పెరిగింది. మరికొన్ని పాపులర్ బ్రాండ్ బీర్లపై రూ.30 వరకు కూడా పెరుగుతోంది.
ఇక కింగ్ ఫిషర్ రూ.120
ధరల పెరుగుదల తర్వాత రూ.100కు దొరికే క్వార్టర్ రూ.120కి పెరుగుతుంది. బ్లాక్ డాగ్, హండ్రెడ్ పైపర్, టీచర్స్ వంటి ఫుల్ బాటిల్ స్కాచ్ రేట్లు రూ.150 వరకు పెరుగుతుంది. ఇప్పటి వరకు రూ.100కు దొరికిన కింగ్ ఫిషర్ లైట్ ఇక నుంచి రూ.120 అవుతోంది. రూ.120కి దొరికే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీరు రూ.130 అవుతుంది.
ఈవెంట్స్ కూడా..
అంతేకాదు, వినోదభరిత కార్యక్రమాల నుంచి కూడా ఆదాయం రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ సందర్భాల్లో నిర్వహించుకునే ప్రయివేటు పార్టీలు, ఈవెంట్స్, క్లబ్స్ చేపట్టే వినోద కార్యక్రమాల సందర్భంగా మద్యాన్ని సర్వ్ చేయడంపై భారీగా లైసెన్స్ ఫీజులు వడ్డించింది. లైసెన్స్ ఫీజు పెంపు ఉత్తర్వుల్ని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో, జిల్లాల్లో ప్రతి ఈవెంట్కు రూ.9,000 వసూలు చేస్తున్నారు. దీనిని తాజాగా ఎక్సైజ్ శాఖ రూ.12,000కు పెంచింది. జీహెచ్ఎంసీ, పరిసరాల్లోని 5 కి. మీ. పరిధిలోని ఫోర్ స్టార్ అంతకన్నా ఖరీదైన హోటళ్లలో నిర్వహించే ఈవెంట్స్కు రూ.12,000 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది రూ.20,000కు పెంచారు. స్పోర్ట్స్, కమర్షియల్, ఇతర వినోద కార్యక్రమాల విషయంలో మాత్రం వాటికి హాజరయ్యే వారి ఆధారంగా రేట్లు ఉంటాయి.