వర్క్ ఫ్రమ్ హోమ్ మరో 3 నెలలు, IT ఇండస్ట్రీకి ఊరట: ఏడాది ఇచ్చే అవకాశముందా?
ఐటీ కంపెనీలు, బీపీవో సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31వ తేదీ వరకు ఇళ్ళ నుండి పని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో గుడ్న్యూస్: వారికి చేదు, ఈ 3 నష్టాలు
ఐటీ కంపెనీలకు ఊరట
వర్క్ ఫ్రమ్ హోమ్కు కేంద్రం ఇంతకుముందు ఇచ్చిన అనుమతి ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ను పొడిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ, బీపీవో కంపెనీల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జూలై 31వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తున్నట్లు రవిశంకర ప్రసాద్ తెలిపారు. తమ ఉద్యోగులను, సిబ్బందిని దశల వారీగా తిరిగి కార్యాలయాలకు రప్పించాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయం ఐటీకి ఊరట అని నాస్కామ్ తెలిపింది.
ఈ ఏడాదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి..
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అశ్వథ్ నారాయణ మాట్లాడుతూ... వర్క్ ఫ్రమ్ హోమ్ను మార్చి 31, 2021 వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఇవ్వాలని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ను కోరారు. దీనికి రవిశంకర ప్రసాద్ స్పందిస్తూ.. జూలై చివరలో దీని గురించి ఆలోచిద్దామన్నారు.
ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్
వర్క్ ఫ్రమ్ హోమ్ దృష్ట్యా భారత్ నెట్ కింద ఇంటర్నెట్ సర్వీస్ మరింత బలపరుస్తామని రవిశంకర ప్రసాద్ చెప్పారు. దాదాపు 80 శాతం నుండి 90 శాతం ఐటీ కంపెనీలు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నాయి. కాగా, అంతకుముందు మార్చి నెలలో ఏప్రిల్ 30వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనిని పొడిగించింది.