Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
Infosys: ఐటీ కంపెనీలు ప్రస్తుతం చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ క్రమంలో అంతర్జాతీయ కంపెనీలు నిర్ధక్షణ్యంగా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇండియన్ కంపెనీలు మాత్రం పొమ్మనలేక పొగపెట్టే పనులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా చేసిన పని ఐటీ రంగంలో భయాందోళనలకు కారణంగా నిలుస్తోంది.
అసలు ఏమైంది..
వ్యాపార విస్తరణలో భాగంగా కంపెనీలు కొన్ని నెలల కిందట ఇన్ఫోసిస్ వందల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంది. వారికి ఆఫర్ లెటర్లను సైతం అందించింది. ఇది జరిగి దాదాపు 8 నెలలు గడుస్తోంది. పైగా వారందరూ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించటంపై సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది ఉసూరు మంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీ ఏం చేసిందంటే..
ప్రస్తుత తరుణంలో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్మెంట్ పేరుతో ఒక పరీక్షను నిర్వహించింది. ఇందులో విఫలమైన వందలాది మందిని తొలగించినట్లు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ పరీక్ష ద్వారా కంపెనీ దాదాపు 600 మంది ఫ్రెషర్లను తొలగించిందని తెలుస్తోంది. ఇన్నాళ్లుగా వేచి ఉన్నవారు చివరికి ఇలా జరగటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రెషర్ చెప్పిన వాస్తవాలు..
2022 ఆగస్టులో తాను కంపెనీలో పనిచేయటం ప్రారంభించినట్లు ఫ్రెషర్ వెల్లడించాడు. తనకు కంపెనీ SAP ABAP స్ట్రీమ్ కోసం శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు. తనతో పాటు మెుత్తం 150 మంది పరీక్ష రాయగా కేవలం 60 మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు తెలిపాడు. మిగిలిన వారంతా రెండు వారాల కిందట తొలగించబడ్డారని అతడు వెల్లడించాడు. ఇలా ఇన్ఫోసిస్ నిర్వహించిన అంతర్గత పరీక్షలో గత కొన్ని నెలలుగా దాదాపు 600 మంది తొలగించబడినట్లు సమాచారం.
జూలైకి ముందు చేరినవారు..
కంపెనీలో జూలై 2022కి ముందు చేరిన ఫ్రెషర్ల విషయంలో మాత్రం ఇలా జరగలేదని తెలుస్తోంది. వారు కంపెనీ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ వారిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించలేదని తాజాగా జాబ్ కోల్పోయినవారు తెలిపారు. ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న తమకు 8 నెలల తర్వాత ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావటంపై వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇన్నాళ్లు ఆన్ బోర్డింగ్ కోసం వేచి ఉన్నానని, ఎలాంటి ఆదాయం లేదని, పైగా తన రెజ్యూమ్ లో గ్యాప్ ఉందని పరీక్షలో విఫలమైన ఒక ఫ్రెషర్ ఆవేదన వ్యక్తం చేశాడు.