ప్రపంచ టాప్ ఐటీ కంపెనీగా.. యాక్సెంచర్ను వెనక్కి నెట్టిన TCS
టాటా గ్రూప్కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రపంచ అత్యంత విలువైన ఐటీ సంస్థగా అవతరించింది. నిన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్ను వెనక్కి నెట్టి, ముందుకు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాలు ప్రకటించడంతో నిన్న షేర్ ధర దూసుకెళ్లింది. ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ నిన్న 3 శాతానికి పైగా లాభపడి రూ.2,818 వద్ద ముగిసింది. షేర్ దూకుడుతో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లను దాటేసింది. దీంతో ప్రపంచ అత్యంత విలువైన ఐటీ సంస్థగా అవతరించింది.
ఉద్యోగులకు TCS శుభవార్త, వారికి వేతనాల పెంపు.. కానీ: రూ.3,000 వద్ద షేర్ల బైబ్యాక్
యాక్సెంచర్ను వెనక్కి నెట్టిన టీసీఎస్
టీసీఎస్ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో పాటు బైబ్యాక్ వార్తలతో ఈ షేర్ భారీగా లాభపడింది. టీసీఎస్ షేర్ ధర రూ.2,800 దాటడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,59,973.63 కోట్లకు చేరకుంది. డాలర్ వ్యాల్యూలో రూ.144.73 బిలియన్ డాలర్లుగా ఉంది. యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 143.4 బిలియన్ డాలర్లుగా (10.52 లక్షల కోట్లు) ఉంది. దీంతో మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో టీసీఎస్ అగ్రస్థానానికి చేరుకుంది. యాక్సెంచర్ రెండో స్థానానికి దిగిజారింది. మరో ప్రపంచ ఐటీ దిగ్గజం ఐబీఎం 118.5 బిలియన్ డాలర్లతో (8.67 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉంది.
ఒక్కరోజే రూ.32,796 కోట్లు
నిన్న టీసీఎస్ షేర్ వ్యాల్యూ 3.02 శాతం లాభపడింది. రూ.82.50 ఎగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న ఒక్కరోజే రూ.32,796.63 కోట్లు పెరిగింది. టీసీఎస్ ఇటీవలే రూ.9 లక్షల కోట్ల మార్క్, ఆ తర్వాత రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ నెంబర్ వన్ ఐటీ సంస్థగా నిలిచింది. రూ.16,000 కోట్ల స్టాక్స్ బైబ్యాక్తో పాటు ఉద్యోగులకు వేతన పెంపు, ప్రమోషన్లు ఉంటాయని ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన రెవెన్యూ వృద్ధి 3 శాతం పెరిగి రూ.40,135 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయ క్లయింట్స్ క్లౌడ్, డిజిటల్ ప్రాజెక్టులపై ఖర్చులు చేస్తుండటంతో ఈ విభాగంలో ఆదాయం పెరిగింది.
ప్రపంచంలో మార్కెట్ విస్తరణ
గత త్రైమాసికంతో పోలిస్తే టీసీఎస్ మెరుగైన తీరు కనబరచడానికి బీఎఫ్ఎస్ఐ, రిటైల్, సీపీజీ, లైఫ్ సైన్సెస్ వంటి కీలక విభాగాల్లో వృద్ధి సాధించడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఐరోపాతో సహా ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ తన మార్కెట్ వాటాను విస్తరిస్తోందన్నారు. భారత టాప్ ఐటీ కంపెనీల్లో టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర ఉన్నాయి.