TCS Q1 results: టీసీఎస్ అదుర్స్, మూడు నెలల్లో 20వేల ఉద్యోగాలు
ముంబై: TCS ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 28.5 శాతం వృద్ధి మోదు చెంది రూ.9008 కోట్లకు చేరుకుంది. 2020-21 జూన్ త్రైమాసిక నికర లాభం రూ.7008 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.38,322 కోట్ల నుండి 18.5 శాతం పెరిగి రూ.48,411 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో 810 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లను కంపెనీ దక్కించుకుందని టీసీఎస్ సీఎఫ్ఓ సమీర్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,09,058గా ఉంది.
టీసీఎస్.. ప్రపంచంలో రెండో స్థానంలో
ఉద్యోగుల సంఖ్యలో టీసీఎస్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. 5.37 లక్షల ఉద్యోగులతో అమెరికా ఐటీ కంపెనీ యాక్సెంచర్ రెండో స్థానంలో ఉంది. ఇన్ఫోసిస్లో 2.5 లక్షలు, విప్రోలో 1.9 లక్షలు, HCL టెక్నాలజీస్లో 1.6 లక్షల ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే 10 లక్షల మందికి పైగా ఉద్యోగం కల్పిస్తున్న రైల్వే శాఖ తర్వాత టీసీఎస్ రెండో అతిపెద్ద కంపెనీ. ఎల్ అండ్ టీలో 3.37 లక్షలు, రిలయన్స్ ఇండస్ట్రీస్లో దాదాపు 2 లక్షలు, ఆదిత్య బిర్లాలో 1.2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
20,409 మంది ఉద్యోగులు
జూన్ త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో నికరంగా 20,409 మంది ఉద్యోగులను చేర్చుకుంది టీసీఎస్. 2021 జూన్ 30 నాటికి మొత్తం ఉద్యోగులు 5 లక్షలు దాటారు. దీంతో ఇప్పుడు 5,09,058కు చేరుకుంది. వలసల రేటు 8.6 శాతంగా ఉంది. ఐటీ పరిశ్రమలో ఇది అత్యల్పం. 2021-22లో కంపెనీ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు, పదోన్నతులు అమలు చేసినట్లు సంస్థ తెలిపింది.
సెకండ్ వేవ్తో దెబ్బ
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశీయ వ్యాపారం మందగించి, మొత్తం కంపెనీ వృద్ధిని వెనక్కి లాగిందని టీసీఎస్ తెలిపింది. భారత వ్యాపారం 14 శాతం తగ్గి రూ.2085 కోట్లకు పరిమితమైంది. అమెరికా మార్కెట్లో ఆకర్షణీయ వృద్ధి సాధించగా, బ్యాంకింగ్, దేశీయ వ్యాపారాలు నిరాశపరిచాయి. కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల పాస్పోర్ట్స్ జారీ, టీసీఎస్ అయాన్ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ వంటివి స్తంభించి, రూ.350 కోట్ల ఆదాయం తగ్గింది.