రూ.9 లక్షల కోట్లు దాటిన TCS మార్కెట్ క్యాప్, HCL టెక్ రికార్డ్ గరిష్టం
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) అరుదైన రికార్డ్ సాధించింది. దేశీయ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీ టీసీఎస్. ఎం-క్యాప్ పరంగా రిలయన్స్ తర్వాత టీసీఎస్ ఎప్పటి నుండో కొనసాగుతోంది. తాజాగా, సోమవారం (సెప్టెంబర్ 14) ఐటీ స్టాక్స్ దూసుకెళ్లాయి. ప్రధానంగా హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో.. ఇలా దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు మూడు శాతానికి పై నుండి 10 శాతం వరకు ఎగిశాయి.
రూ.50,000 కిందకు దిగి వస్తుందా, ఈ వారంలో బంగారం ధరలు ఎలా ఉండొచ్చు?
ఐటీ షేర్ల జూమ్
ఈరోజు హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర ఏకంగా 9.89 శాతం ఎగిసి రూ.793 వద్ద క్లోజ్ అయింది. విప్రో షేర్ ధర 4.36 శాతం ఎగిసి రూ.306 వద్ద, టీసీఎస్ షేర్ ధర 4.67 శాతం ఎగిసి రూ.2,485 వద్ద, టెక్ మహీంద్రా షేర్ ధర 3.25 శాతం ఎగిసి రూ.790 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ ధర 3.10 శాతం ఎగిసి రూ.975 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు టీసీఎస్ ఓ ఘనత సాధిస్తే, హెచ్సీఎల్ టెక్నాలజీస్ దాదాపు 10 శాతం ఎగిసి మరో ఘనత సాధించింది.
రూ.9 లక్షల కోట్ల కంపెనీగా టీసీఎస్
టీసీఎస్ షేర్లు ఈ రోజు 4.67 శాతం ఎగిసింది. ఉదయం ట్రేడింగ్లో షేర్ ధర 2 శాతానికి పైగా లాభంతో రూ.2,442 వద్ద ఉన్నప్పుడే టీసీఎస్ షేర్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9 లక్షలు అధిగమించింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.9.35 లక్షల కోట్లు దాటింది. ఈ దూకుడుతో ముందుకు సాగితే త్వరలో రూ.10 లక్షల కోట్ల కంపెనీగా ఎదగనుంది. రిలయన్స్ తర్వాత ఈ మార్కెట్ క్యాప్ను దాటిన రెండో సంస్థ టీసీఎస్. ఐటీ రంగంలో మెరుగైన షేర్లలో టీసీఎస్ ఒకటి అని నిపుణులు భావిస్తున్నారు. 2025 నాటికి కంపెనీ ఉద్యోగుల్లో 75 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని టీసీఎస్ చెబుతోంది. దీని వల్ల రెంట్, ట్రాన్సుపోర్ట్ ఖర్చులు భారీగా తగ్గిపోనున్నాయి. 2020 సంవత్సరంలో టీసీఎస్ 10 శాతం లాభపడింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 24లో కనిష్ట షేర్ ధరతో పోలిస్తే ఏకంగా 40 శాతం ఎగిసింది.
HCL దూకుడు
మరోవైపు HCL టెక్నాలజీస్ షేర్ ధర ఈ రోజు ఓ సమయంలో 12 శాతం వరకు ఎగిసింది. చివరకు దాదాపు 10 శాతం వద్ద ముగిసింది. ఈ ఐటీ దిగ్గజం సెప్టెంబర్ ఫలితాలను సవరించింది. ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయని తెలిపింది. దీంతో హెచ్సీఎల్ టెక్ షేర్ ధర ఏకంగా రూ.71కి పైగా పెరిగింది. అంతకుముందు సెషన్లో రూ.721 వద్ద క్లోజ్ కాగా, ఈ రోజు రూ.793 వద్ద క్లోజ్ అయింది.