ఆఫీస్లకు TCS ఉద్యోగులు, ఎప్పుడంటే? కానీ ఆలోచించాకే..
కరోనా మహమ్మారి తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ వేగవంతమవుతోన్న నేపథ్యంలో వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా భారత్లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఐటీ కంపెనీలు గత ఏడాది మార్చి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఇప్పుడు సంవత్సరంన్నర నుండి ఉద్యోగులు ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది చివరి నుండి ఐటీ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంటే దాదాపు రెండేళ్ల తర్వాత కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయానికి రప్పించనున్నాయి. ఇందులో భాగంగా దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ ఏడాది చివరి నాటికి డెబ్బై శాతం నుండి ఎనభై శాతం ఉద్యోగులను కార్యాలయానికి రప్పించేందుకు ప్లాన్ చేస్తోంది.
వర్క్ ప్రమ్ హోమ్...
ఐటీ కంపెనీలు ప్రస్తుతం అనుసరిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి త్వరలో ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, కొత్త కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తుండటం కారణం. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో టీసీఎస్ తన 5,00,000 మంది ఉద్యోగుల్లో 70 శాతం నుండి 80 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే యోచన చేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ రాజేష్ గోపీనాధన్ తెలిపారు. అదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి పరిణామాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ టీసీఎస్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే మిగతా ఐటీ కంపెనీలు దీనిని అనుసరించే అవకాశాలు ఉంటాయి. గత ఏడాది మార్చిలో కరోనా ఉద్ధృతి ప్రారంభమై, దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధించడంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.
టీసీఎస్ వాటా
దాదాపు 195 బిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన టీసీఎస్ సంస్థ మరింత వృద్ధి దిశగా ప్రణాళికలు వేస్తోంది. అయితే కొత్త కంపెనీలను కొనుగోలు చేసే ప్రణాళికలు లేవని, దానికి బదులు సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తామని రాజేష్ గోపినాథన్ తెలిపారు. దేశీయ 150 బిలియన్ డాలర్ల ఐటీ ఉత్పత్తుల్లో టీసీఎస్ వాటా 15 శాతం. దేశీయ 46 లక్షల ఐటీ ఎగుమతుల్లో టీసీఎస్ 10 శాతం వాటాను కలిగి ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. రూ.15,000 లక్షల కోట్లు దాటి రిలయన్స్ మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్ రూ.14,20,935 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. గతవారం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.44,832 కోట్లు పెరిగింది.
టీసీఎస్ షేర్ జంప్..
టీసీఎస్ స్టాక్ ఇటీవల భారీగా ఎగిసిపడుతోంది. ఆరు నెలల కాలంలో దాదాపు 30 శాతం, ఏడాది కాలంలో 65 శాతం, ఈ క్యాలెండర్ ఏడాదిలో 31 శాతం లాభపడింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.3850 వద్ద ఉంది. టీసీఎస్ షేర్ ధర జంప్ అవుతుండటంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2021 ఆగస్ట్ నెలలో మొదటిసారి రూ.13 లక్షల కోట్ల మార్కును తాకింది. లిస్టెడ్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత టీసీఎస్ రెండో స్థానంలో ఉంది.