ట్యాక్స్ పేయర్స్ దాదాపు రెట్టింపు, కరోనా సమయంలో అధిగమించాం: నిర్మలా సీతారామన్
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ట్యాక్స్పేయర్ బేస్ రెండింతలు అయిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ అమలుకు నేటికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ట్యాక్స్ ఆఫీసర్స్ను అభినందించారు. గత కొన్ని నెలలుగా ఆదాయ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని, ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎస్టీ మోసాలపై చర్యలు తీసుకోవడం, ఐటీసీ రిజిస్ట్రేషన్లు వంటి విషయాల్లో ప్రతి సంవత్సరం ప్రశంసనీయ పనితీరు కనబరుస్తున్నట్లు తెలిపారు.
కొద్ది నెలలుగా జీఎస్టీ ఆదాయం మెరుగయిందని, వరుసగా ఎనిమిది నెలల పాటు జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లకు పైగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లతో రికార్డ్ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. జీఎస్టీ అమలగు తర్వాత తక్కువ పన్నులతో వసూళ్లు పెరిగాయన్నారు. గత నాలుగేళ్లలో పన్ను చెల్లింపుదారులు 66.25 లక్షల నుండి 1.28 కోట్లకు పెరిగారన్నారు.
కరోనా సమయంలోను జీఎస్టీ వసూళ్లను అధిగమించామన్నారు. భారత్ వంటి దేశంలో ఇంత పెద్ద సంస్కరణలు అమలు చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్లను అధిగమించి జీఎస్టీని విజయవంతం చేసిన కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులను అభినందించారు. జీఎస్టీని వాస్తవంలోకి తీసుకు రావడంలో సహకారం అందించిన పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.