నాన్సెన్స్! మిస్త్రీకి మరో షాకిచ్చిన టాటా సన్స్, ఆ సెటిల్మెంట్కు నో
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ప్రతిపాదించిన సెటిల్మెంట్ ఆఫర్ను టాటా సన్స్ గురువారం తిరస్కరించింది. వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (SPG) మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో వాదనలు సాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ టాటా సన్స్లో తమకు ఉన్న 18.37 శాతం వాటాకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లు కేటాయించాలని SP గ్రూప్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అర్థరహితమని టాటా గ్రూప్ పేర్కొంది. అలా చేస్తే టాటా గ్రూప్లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్పీ గ్రూప్ మళ్లీ మైనార్టీ వాటాలు తీసుకున్నట్లు అవుతుందని, పెద్ద తేడా ఉండదని తెలిపింది.
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చేసిన సెటిల్మెంట్ ఆఫర్ నాన్సెన్స్ (అర్థం లేనిది)గా టాటా గ్రూప్ కొట్టి పారేసింది. టాటా సన్స్ తరఫున హరీష్ సాల్వే, ఎస్పీ గ్రూప్కు చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ తరఫున సీనియర్ అడ్వోకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై సోమవారం కూడా విచారణ జరగనుంది.
కాగా, టాటా గ్రూప్తో 7 దశాబ్దాల బంధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధమని, తమకు రూ.1.75 లక్షల కోట్లు రావాల్సి ఉంటుందని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు టాటా గ్రూప్తో కలిసి ఉన్న ఆస్తులు, వాటాల విభజన ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 28 అక్టోబర్ 2016లో సైరస్ మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుండి సాగనంపిన తర్వాత రెండు కంపెనీల మధ్య లీగల్ బాటిల్ నడుస్తోంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్(SPG) తమ వాటాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, టాటాలు కూడా కొనుగోలుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
టాటా సన్స్-షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ విభేదాలు, మరిన్ని కథనాలు
SPG గ్రూప్ విభజన ప్రణాళికను భారత అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. టాటా సన్స్ను రెండు గ్రూప్లు కలిగిన కంపెనీగా చెప్పవచ్చునని, 81.6 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలతో కూడిన టాటా గ్రూప్ అని, రెండోది 18.37 శాతం వాటా కలిగిన మిస్త్రీ కుటుంబానిదని తెలిపింది. టాటా సన్స్లో తమ వాటా వ్యాల్యూ రూ.1.75 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు తెలిపింది. అయితే ఇది రూ.70 వేల కోట్ల నుండి రూ.80వేల కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది.