ఎయిరిండియా బిడ్: 67 ఏళ్ల తర్వాత రేసులో టాటా, ఉద్యోగులు కూడా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కొనుగోలుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది. ఎయిరిండియా ఉద్యోగులు కూడా తమ సంస్థ కొనుగోలుకు ముందుకు రావడం గమనార్హం. కంపెనీ కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ(EOI) బిడ్ దాఖలుకు సోమవారం (డిసెంబర్ 14) సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. గుడువు నేటితో పూర్తి అయింది. చివరి రోజు టాటా సన్స్ EOIని దాఖలు చేసింది. బిడ్ అర్హత సాధిస్తే వచ్చే పదిహేను రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించే అవకాశం ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
చైనాకు శాంసంగ్ షాక్, మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు మరో అడుగు
రేసులో టాటా గ్రూప్
ఎయిరిండియాలో వాటా కొనుగోలు కోసం టాటా గ్రూప్ పెట్టుబడుల ఉపసంహరణ శాఖకు శాఖకు EOIని దాఖలు చేసింది. ఇది ఆసక్తిని వ్యక్తం చేయడమేనని, ఫైనాన్షియల్ బిడ్ను మరో 2 వారాల్లో దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టాటా గ్రూప్ దేశీయంగా ఎయిర్ ఏషియా, విస్తారా బ్రాండ్స్తో భాగస్వామ్య సంస్థల్ని నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో మెజార్టీ వాటా కొనుగోలు కోసం టాటా సంస్థ సొంతంగా ముందుకు వెళ్తోందా లేక భాగస్వాములతో కలిసి సాగుతుందా తెలియాల్సి ఉంది. దీనిపై టాటా ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.
67 ఏళ్ల తర్వాత...
ప్రస్తుత ఎయిరిండియాను 1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరిట టాటా గ్రూప్ నెలకొల్పింది. 1946లో ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఇప్పుడు 67 సంవత్సరాల తర్వాత అదే ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా సంస్థ ముందుకు రావడం గమనార్హం.
51 శాతం వాటా కోసం..
ఎయిరిండియా బిడ్డింగ్ చివరి రోజు 209 మంది ఉద్యోగుల గ్రూప్ 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ బిడ్కు ప్రస్తుత ఎయిరిండియా కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మల్లిక్ నేతృత్వం వహిస్తున్నారు. బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్తో కలిసి మాత్రమే ఉద్యోగులు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో ఉద్యోగి రూ.1 లక్ష చొప్పున ఇందుకు కేటాయించనున్నారు. ఎయిరిండియా ప్రయివేటీకరణకు 2018లోను కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీలు ఏవీ ముందుకు రాలేదు.
రుణాలు భరించాలి
ఎయిరిండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ.23,000 కోట్ల రుణాలను భరించవలసి ఉంటుంది. ఎయిరిండియా మొత్తం రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న SPVకి బదలీ చేయనున్నారు. ఎయిరిండియా ఎంటర్ప్రైజ్ వ్యాల్యూను మార్కెట్ క్యాపిటలైజేషన్, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, బ్యాలన్స్ షీట్లో ఉన్న నగదు తదితరాల ఆధారంగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.