టాటా ఉదారత, కరోనాతో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ప్రతి నెల వేతనం
కరోనా వైరస్ లక్షలాది ప్రాణాలను తీసుకెళ్లి, వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చాలా కుటుంబాలకు ఆర్థికంగా పెద్దదిక్కుగా ఉన్నవారిని తీసుకెళ్లింది. ఇది ఆ కుటుంబాలను చీకట్లోకి నెట్టివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ దిగ్గజం టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన తన ఉద్యోగస్తుల కుటుంబానికి సామాజిక భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి, ఆ ఉద్యోగి రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు ప్రతి నెల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
గుడ్న్యూస్, ఏప్రిల్ 2022 నుండి మొబైల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్స్ మార్చుకోవచ్చు
చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి వేతనం
టాటా స్టీల్ ఔదార్యం అందరి మన్ననలు పొందుతోంది. సోషల్ మీడియాలో రతన్ టాటా పైన ప్రశంసలు కురుస్తున్నాయి. ఎవరైనా ఉద్యోగి కరోనాతో మృతి చెందితే ఆ ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబానికి ప్రతి నెల అందించనున్నట్లు ప్రకటించింది. సామాజిక మాద్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ తన నిర్ణయాన్ని తెలిపింది.
ఫ్రంట్ లైన్ వర్కర్లకు అదనపు సాయం
టాటా స్టీల్ కంపెనీలో పని చేస్తూ కరోనాతో మరణించిన ఫ్రంట్ లైన్ ఉద్యోగులు లేదా వర్కర్ల పిల్లల చదువులకు ఖర్చులు కంపెనీయే భరిస్తుంది. వారిని గ్రాడ్యుయేషన్ వరకు చదివిస్తుంది. వీరికి నెల శాలరీ అందించడంతో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబాలకు ఈ అదనపు సాయం కల్పించనున్నట్లు ప్రకటించింది. జంషెడ్పూర్ కేంద్రంగా పని చేస్తోన్న టాటా స్టీల్ ఔదార్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అదే మద్దతు
తమ కంపెనీలోని ఉద్యోగులు కరోనాతో మృతి చెందడం పట్ల కలత చెందుతున్నామని, వారి కుటుంబానికి అండగా నిలుస్తామని టాటా స్టీల్ పేర్కొంది. ఉద్యోగి తీసుకున్న చివరి వేతనాన్ని, సదరు మృతి చెందిన ఉద్యోగి రిటైర్మెంట్ వయస్సు 60 వచ్చే వరకు అందిస్తామని తెలిపింది. స్టేక్ హోల్డర్లకు కంపెనీ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని పేర్కొంది. ఈసారి కూడా అదే కొనసాగిస్తున్నామని వెల్లడించింది.