67 ఏళ్ల తరువాత: ఎయిరిండియా మళ్లీ టాటాల చేతికి: ఈఓఐ దాఖలుకు ఛాన్స్?
ముంబై: ప్రభుత్వరంగానికి చెందిన పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా.. ఇక మళ్లీ ప్రైవేటు బాట పట్టబోతోంది. నష్టాల పేరుతో దీన్ని విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చేపట్టిన చర్యలు ఇక కొలిక్కి రానున్నట్లు కనిపిస్తోంది. బిడ్లను దాఖలు చేయడానికి గడువుల మీద గడువులు పెంచుకుంటూ పోయినప్పటికీ.. ఎవ్వరూ గానీ ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో టాటా సన్స్ యాజమాన్యం.. ఎయిరిండియాను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
టాటా సన్స్ యాజమాన్యం.. కాస్సేపట్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్-ఈఓఐ) దాఖలు చేస్తుందని సమాచారం. ఈఓఐ దాఖలు చేయడానికి సోమవారమే చివరి తేదీ. నిజానికి భారత్లో పౌర విమానాయాన సర్వీసులు మొదట్లో టాటా సన్స్ చేతిలోనే కొనసాగాయి. పౌర విమానయాన సర్వీసులు టాటా సన్స్ ద్వారానే ఆరంభం అయ్యాయి. ఇప్పటి ఎయిరిండియా.. మొదట టాటా ఎయిర్లైన్స్ పేరుతో కొన్నేళ్ల పాటు సేవలను అందించింది.
1932 అక్టోబర్ 15న జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) టాటా ఈ ఎయిర్లైన్స్కు ఆద్యుడు. 1946లో దీనికి పేరు మారచారు. ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 1953లో కేంద్ర ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి 2001లో టాటా సన్స్ ప్రయత్నాలు సాగించింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం.. దీన్ని విక్రయించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
ఎయిరిండియాలో పెట్టుబడులను ఉపసంహరించడంపై నిరాకరించింది. అదే సమయంలో- టాటా సన్స్ పౌర విమానయాన రంగంలో అడుగు పెట్టింది. ఎయిర్ ఏసియా, విస్తారా పేర్లతో రెండు సంస్థలను ప్రారంభించింది. ఎయిర్ ఏసియా, సింగపూర్ ఎయిర్లైన్స్ ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. తాజాగా ఎయిరిండియాను సోలోగా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపర్చుతున్నట్లు తెలుస్తోంది. ఈఓఐలను దాఖలు చేయడానికి చివరి గడువు సోమవారమే. కాస్సేపట్లో ఈఓఐ దాఖలు చేస్తారని సమాచారం.