టాటా మోటార్స్ వాహన కొనుగోలుదారులకు షాక్, రేపటి నుండి ధరల పెంపు
టాటా మోటార్స్ వాహనాల కొనుగోలుదారులకు అలర్ట్! రేపటి (మే 8, శనివారం) నుండి వాహనాల ధరలు 1.8 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు పెంపు ఉంటుందని, పెరిగిన ధరలు రేపటి నుండి అమలులోకి వస్తాయని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తెలిపింది. మోడల్ను, వేరియంట్ను బట్టి కొంత మార్పు ఉండవచ్చునని వెల్లడించింది. నేడు కార్లు బుక్ చేసుకొన్న వారికి మాత్రం పాత ధరకే విక్రయిస్తామని తెలిపింది. అంటే ఈ రోజు వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రం ఊరట.
స్టీల్, కీలకమైన మెటల్ ధరలు పెరగడంతో కస్టమర్లపైకి ఈ భారం బదలాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్యాసింజర్స్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ సుశీల్ చంద్ర అన్నారు. కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి వరకు బుక్ చేసుకొన్న వారికి పాత ధరలకే వాహనాలను డెలివరీ చేస్తామన్నారు. రేపటి నుండి బుక్ చేసుకొనే వారికి కొత్త ధరలు వర్తిస్తాయన్నారు. మార్కెట్లో లభిస్తున్న బలమైన ఆదరణతో తమ ఉత్పత్తులను కొనసాగిస్తామని, టాటా బ్రాండ్ పైన నమ్మకం ఉంచినందుకు తమ కస్టమర్లకు థ్యాంక్స్ అన్నారు.
టాటా మోటార్స్ ధరలను పెంచడం ఈ సంవత్సరంలో ఇది రెండోసారి. జనవరిలో ఒకసారి రూ.26 వేల వరకు పెంచింది. ప్రస్తుతం చాలా వరకు టాటా మోటార్స్ యూనిట్లు కరోనా కారణంగా క్లోజ్ చేశారు. ఏప్రిల్లో కంపెనీ విక్రయాలు 41 శాతం తగ్గాయి.