అవసరమైతే ప్లాంట్ క్లోజ్, ఉద్యోగులు ప్లాంట్కు రాకపోయినా వేతనాలు: టాటా మోటార్స్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైతే తమ ప్లాంట్ను కొద్ది రోజులు మూసివేస్తామని టాటా మోటార్స్ వెల్లడించింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్లాంట్లో వాహనాల తయారీ కార్యకలాపాలు తగ్గించామని, పరిస్థితులు మరింత తీవ్రమైతే ప్లాంట్ మూసివేస్తామని తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ గ్వెంటర్ బషెక్ తెలిపారు.
మళ్లీ షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు.. రికార్డ్ ధరతో ఎంత తక్కువంటే?
ప్లాంట్ మూసేసేందుకు సిద్ధం
దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల పరిధిలో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, కరోనా ప్రభావం ఇంకా తీవ్రమైతే మంగళవారం నుండి ప్లాంట్ కార్యకలాపాలు ఆపేసేందుకు సిద్ధమనితెలిపారు. కరోనా మహమ్మారి దేశాన్ని, ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.
ఐనా వేతనాలు చెల్లిస్తాం
మహారాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ముంబై, పుణే వంటి పెద్ద పెద్ద నగరాల్లో అత్యవసరమైతే తప్ప మిగతా దుకాణాలను క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడే టాటా మోటార్స్ ప్లాంట్ ఉంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. అంతేకాదు, కరోనా కారణంగా ప్లాంట్ మూసివేత లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ మార్చి, ఏప్రిల్ నెల వేతనాలు చెల్లిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.
యూకేలో జాగ్వార్ కార్యకలాపాలు నిలిపివేత
టాటా దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కేంద్రాలు ఉన్నాయి. పుణేలో తయారీ ప్లాంట్ ఉంది. ఎక్కువగా కార్లు, ట్రక్స్కు సంబంధించిన తయారీ కార్యకలాపాలు ఇక్కడే నిర్వహిస్తారు. టాటాకు చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ కూడా యూకేలో తమ కార్యకలాపాలు నిలివేయనున్నట్లు అంతకుముందు ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ వరకు కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది.