టాటా గ్రూప్ చేతికి మహారాజా, ప్రధాని మోడీని కలవనున్న చంద్రశేఖరన్
భారత విమానయాన సంస్థ ఎయిరిండియా టాటాల చేతుల్లోకి వెళ్తోంది. ఈ వారం చివరికల్లా ఎయిరిండియాను టాటా గ్రూప్కు అప్పగించే అవకాశాలు ఉన్నాయని నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. వేలం ప్రక్రియ ద్వారా ఈ విమానయాన సంస్థను టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రయివేట్ లిమిటెడ్ గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన కొనుగోలు చేసింది. రూ.18,000 కోట్లకు దీనిని వశం చేసుకుంది. ఎయిరిండియాలో వంద శాతం వాటా విక్రయానికి అంగీకారం తెలుపుతూ లెటర్ ఆఫ్ ఇంటెంట్ను టాటా గ్రూప్కు అక్టోబర్ 11న ప్రభుత్వం జారీ చేసింది.
అక్టోబర్ 25న ఈ ట్రాన్సాక్షన్కు సంబంధించి షేర్ల విక్రయ ఒప్పందంపై కేంద్రం సంతకాలు చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించి మిగతా ప్రక్రియ రాబోయే కొద్ది రోజుల్లో పూర్తయ్యే అవకాశముందని ఇటీవల అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కూడా టాటా గ్రూప్కు అప్పగించాల్సి ఉంది. ఎయిరిండియా ఎస్ఏటీఎస్లో 50 శాతం వెళ్తుంది.
టాటా గ్రూప్కు ఎయిరిండియాను నేడు కేంద్రం అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కావాల్సిన అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తయ్యాయి. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని నరేంద్ర మోడీని నేడు కలవనున్నారు. ఈ సందర్భంగా ఎయిరిండియా... టాటాల చేతికి రానుంది. ఎయిరిండియాను వరల్డ్ క్లాస్ ఎయిర్ లైన్స్గా మార్చే ప్రయత్నం చేస్తామని చంద్రశేఖరన్ గతంలో తెలిపారు.
ఎయిరిండియా కోసం టాటా గ్రూప్ 100 రోజుల ప్లాన్ను సిద్ధం చేసుకుంది. ఎయిరిండియా చేతికి వచ్చాక టాటా గ్రూప్ కొత్త బోర్డు సిద్ధం కానుంది. ప్రస్తుతం ఎయిరిండియా బిగ్గ్సెట్ ఓవర్సీస్ క్యారియర్. టాటా గ్రూప్కు చెందిన విస్తారా డొమెస్టిక్ మార్కెట్లో ఇండిగో తర్వాత నెంబర్ టూగా ఉంది. ఎయిరిండియా, విస్తారాతో మార్కెట్ వాటా పెరగనుంది.
విస్తారాతో పాటు ఎయిరేషియాలోను టాటాలకు మెజార్టీ వాటా ఉంది. 1932 అక్టోబర్ 15న టాటా ఎయిర్ లైన్స్గా ఎయిరిండియా ప్రస్తానం మొదలైంది. 1953లో టాటాల నుండి మెజార్టీ వాటాను పొంది ఎయిరిండియాను జాతీయం చేశారు. 2007లో ఎయిరిండియాలో ఇండియన్ ఎయిర్ లైన్స్ను విలీనం చేశారు. ఇప్పుడు మళ్లీ టాటాల చేతికి వెళ్తోంది.