Air India: రతన్ టాటా పెద్ద ప్లాన్.. నింగిలో గెలిచేందుకు ఎయిర్ ఇండియా..
Air India: రతన్ టాటా ఆయన పట్టుకుంటే విజయం సాధించకుండా వదిలిపెట్టరు. ఇప్పుడు ఎయిర్ ఇండియా విషయంలోనూ ఇదే జరుగుతోంది. కంపెనీని దేశంలో మళ్లీ అగ్రస్థానంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.
టాటా సన్స్..
దేశీయ విమానయాన రంగంలో పెద్ద పందెం వేసేందుకు టాటా సన్స్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తన మహారాజాను తిరిగి వెనక్కుకొన్న టాటాలు.. తమ మిగిలిన విమానయాన కంపెనీలను కూడా ఎయిర్ ఇండియా కిందకు తీసుకొస్తున్నారు. ప్లాన్ లో భాగంగా.. విస్తారా, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లను ఎయిర్ ఇండియాలో విలీనం చేయబోతోంది.సింగపూర్ ఎయిర్లైన్స్ విస్తారాలో టాటా గ్రూప్ భాగస్వామి. దీనిపై సింగపూర్ ఎయిర్లైన్స్తో టాటా మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.
అతిపెద్ద కంపెనీగా..
టాటాలు తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే.. ఫ్లీట్, మార్కెట్ వాటా పరంగా ఎయిర్ ఇండియా దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరిస్తుంది. దీనిపై వారం రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఒకే సంస్థగా పనిచేయడం ప్రారంభించడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. విస్తారా బ్రాండ్ తొలగించబడవచ్చు లేదా అలాగే కొనసాగే అవకాశం ఉంది.
విలీన ప్రక్రియ..
సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో 20 నుంచి 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. విలీనంలో భాగంగా విస్తారాకు చెందిన కొంతమంది బోర్డు సభ్యులను ఎయిర్ ఇండియా బోర్డులో చేర్చవచ్చు. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్ విస్తారా మాతృ సంస్థ టాటా సింగపూర్ ఎయిర్లైన్స్లో 49 శాతం వాటాను కలిగి ఉంది. విస్తారాలో టాటా సన్స్కు 51 శాతం వాటా ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియాల మెర్జర్ ప్రక్రియను టాటా గ్రూప్ ఇటీవలే పూర్తి చేసింది. ఎయిర్ఏషియా ఇండియాలో.. మలేషియా ఎయిర్లైన్స్కు ఉన్న మిగిలిన 16 శాతం వాటాను సైతం టాటాలు కొనుగోలు చేశారు.
కొత్త సీఈవో..
ఎయిర్ ఇండియా టాటాల చేతికి రావటంతో క్యాంప్బెల్ విల్సన్ సీఈవోగా నియమితులయ్యారు. విలీన ప్రక్రియను సీఈవో క్యాంప్బెల్ విల్సన్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో సునీల్ భాస్కరన్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈవో అలోక్ సింగ్లకు అప్పగించారు. విలీనంతో ఎయిర్ ఇండియా మెుత్తం విమానాల సంఖ్య 233కు చేరుకుంటుంది. దీనివల్ల కంపెనీకి నిర్వహణ వ్యయాలు సైతం భారీగా తగ్గుతాయి. దీనికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ ను టాటా గ్రూప్ సిద్ధం చేసినట్లు వర్గాలు తెలిపాయి.