టెలికం ఛార్జీలు పెంచకతప్పదు, కానీ: ఎయిర్టెల్ మిట్టల్, 5Gలో చైనా కంపెనీలపై...
ముంబై: టెలికం టారిఫ్ల పెంపు అనివార్యమని, ప్రస్తుతం ఉన్న డేటా, కాల్ ఛార్జీల ద్వారా టెల్కోలు నిలబడలేవని, కాబట్టి పెంపు అవసరమని, అయితే ఈ పెంపుకు ముందు మార్కెట్ పరిస్థితులు గమనించాల్సి ఉందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మిట్టల్ మాట్లాడారు. మొబైల్ టారిఫ్ పెంపు, 4జీ స్పెక్ట్రం ఆక్షన్, 5జీలోకి చైనీస్ కంపెనీల ఎంట్రీ తదితర అంశాలపై స్పందించారు.
పెంచాల్సిందే
ప్రస్తుత టెలికం ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచవలసిన అవశ్యకత ఉందని సునీల్ మిట్టల్ అన్నారు. మార్కెట్ పరిస్థితులు పరిశీలించి కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఈ విషయంలో ఎయిర్టెల్ ఒక్కటి మాత్రమే పెంపు ద్వారా ముందుకు వెళ్లలేని పరిస్థితి అన్నారు. పరిశ్రమ కలిసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలోను మిట్టల్ టారిఫ్ పెంపు ఉండాలన్నారు. నెలకు 16GB వినియోగానికి కేవలం రూ.160 సరికాదని, ఎన్నో దేశాలతో పోలిస్తే మన దేశంలో డేటా ప్యాక్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. కస్టమర్ నుండి వచ్చే సగటు ఆదాయం-ARPU రూ.200 కంటే పైనఉండాలన్నారు. ప్రస్తుతం టెల్కోల ఆర్పు 150కి అటు ఇటుగా మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్టెల్ ARPU రూ.162గా నమోదయింది.
చైనా కంపెనీలపై...
చైనా టెలికం పరికరాలను, అక్కడి కంపెనీలను 5G నెట్ వర్క్లోకి అనుమతించాలా అనే అంశంపై కూడా మిట్టల్ స్పందించారు. ఇది చాలా పెద్ద ప్రశ్న అని, ఇది దేశం (ప్రభుత్వం) నిర్ణయమని, దేశం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అందరూ తప్పకుండా అంగీకరిస్తారన్నారు. 5G స్పెక్ట్రం ధరలు కంపెనీలకు అందుబాటులో లేవన్నారు.
అగ్రరాజ్యాంలోను పరిమితంగానే...
భవిష్యత్తు తరం సేవలు అందించేందుకు భారత్కు ఇంకా సమయం ఉందన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే మనం ఏమీ వెనుకబడలేదన్నారు. యూరోప్, బ్రిటన్, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోను 5G కవరేజీ పరిమితంగానే అందుబాటులోకి వచ్చిందన్నారు. టెలిగం రెగ్యులేటర్ అథారిటీ (TRAI) డేటా ప్రకారం దేశంలో జియో వైర్ లెస్ మార్కెట్ షేర్ 35 శాతం కాగా, ఎయిర్టెల్ 38 శాతం ఉంది.