త్వరలో ఆన్లైన్ ఆర్డర్లు ఎగిరొస్తాయి! స్విగ్గి, జొమాటో సహా 13 కంపెనీల డ్రోన్ డెలివరీలకు అనుమతి
ఏదో హాలీవుడ్ ఫిక్షన్ సినిమాలో జరిగినట్లు త్వరలోనే ఇండియా లో కూడా ఆకాశమంతా డ్రోన్లు పరుగులు పెట్టనున్నాయి. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇటీవలే 13 సంస్థలకు డ్రోన్లతో డెలివరీ సేవలు అందించేందుకు అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పలు మీడియా రిపోర్టులను ఉటంకిస్తూ ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. దాని ప్రకారం అనుమతులు పొందిన సంస్థల్లో ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గి, జొమాటో, హైపర్ లోకల్ డెలివరీ సంస్థ డాంజో తో పాటు డ్రోన్లను తయారు చేసే త్రొటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఉన్నాయి.
వీటన్నిటికీ బియాండ్ విసువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్ఓఎస్) లో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ను పరీక్షించుకునేందుకు అనుమతులు లభించాయి. అంటే, ఆయా సంస్థలు తమ డెలివరీ కోసం డ్రోన్లను ఉపయోగించి వాటి పనితీరును పరీశీలించుకోవచ్చు. తద్వారా ఒక అధ్యయనం చేసుకుని పనితీరుపై ఒక అంచనా వేసుకోవచ్చు. కాగా, డ్రోన్ల ను వాణిజ్య స్థాయిలో ఎప్పటి నుంచి నడపాలో మాత్రం ఇంకా డీజీసీఏ వెల్లడించినట్లు లేదు.
జియోఫైబర్ యూజర్స్కు బంపరాఫర్, ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితం
జులై తొలి వారమే...
ఎంట్రాకర్ కథనం ప్రకారం డ్రోన్ల ప్రయోగాత్మక వినియోగం జులై మొదటి వారంలోనే ప్రారంభం కానుంది. అంటే, అతి త్వరలో మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్, లేదా మరేదైనా వస్తువు గాలిలో ఎగిరొచ్చి మన చేతికి అందనుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మార్గనిర్దేశకాల ప్రకారం ఒక్కో డ్రోన్ కనీసం 100 కిలోమీటర్ల ఫ్లైట్ టైం ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా సంస్థలు డ్రోన్ల పనితీరును సరిగ్గా పరిశీలించి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుమతులు పొందిన సంస్థలు సెప్టెంబర్ 30 లోగా 100 కిలోమీటర్ల డ్రోన్ల ప్రయాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఆయా సంస్థలు వీలైనంత త్వరగా డ్రోన్ల డెలివరీ ప్రారంభించే అవకాశం ఉంది. స్విగ్గీ అన్రా టెక్నాలజీస్తో జూలైలో డ్రోన్ టెస్టింగ్ ప్రారంభించనుంది.
ఏడాది క్రితమే...
వాస్తవానికి డీజీసీఏ .. గత ఏడాది మే నెలలోనే డ్రోన్ల ప్రయోగాత్మక పరిశీలన అనుమతుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి లోనే డాంజో, త్రొటిల్ ఏరోస్పేస్ కు అనుమతులు రాగా.. కోవిద్-19 ఎఫెక్ట్ తో మిగితా కంపెనీల అనుమతులు జాప్యం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే గతేడాది జొమాటో ఒక డ్రోన్ తో ప్రయోగం కూడా చేసింది. సుమారు 5 కేజీల పేలోడ్ ను మోసుకుంటూ 10 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల ప్రయాణాన్ని అది పూర్తిచేసింది. గతేడాది జూన్ లోనే ఇది జరిగింది. మరో సందర్భంలో ఉత్తరాఖండ్ లోని ఒక జిల్లా ఆస్పత్రి రిమోట్ డ్రోన్ తో 36 కిలోమీటర్ల దూరానికి బ్లడ్ సాంపిల్స్ పంపించింది. పౌర విమానయాన రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డ్రోన్ల ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
తగ్గనున్న డెలివరీ ఖర్చులు...
స్థానిక డెలివరీ లకు డ్రోన్లను ఉపయోగించటం ద్వారా ఖర్చులు బాగా తగ్గించుకోవచ్చని ఈ కామర్స్, డెలివరీ కంపెనీలు భావిస్తున్నాయి. డెలివరీ లో వేగం పెరగటంతో పాటు, ఖచ్చితత్వం కూడా వస్తుందని ఆశిస్తున్నాయి. దీంతో వ్యయాలు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తున్నాయి. అయితే, డ్రోన్ల ను పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించటం అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో వెంటనే డెలివరీ బాయ్స్ అవసరం లేకుండా పోయే అవకాశమే లేదని చెబుతున్నారు. ఇందుకోసం కొన్నేళ్లు పట్టవచ్చని, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరని అంటున్నారు. కానీ కరోనా తర్వాత కాంటాక్ట్ లెస్ డెలివరీ లకు డిమాండ్ పెరగటంతో డ్రోన్ల ద్వారా డెలివరీ లకు అధిక అవకాశం ఉంటుందని మరో వర్గం అంచనా వేస్తోంది.