డీజిల్ వద్దు.. పెట్రోలే ముద్దు.. లేదంటే ఎలక్ట్రిక్! ఎందుకంటే...
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా.. కొంటే పెద్ద కారే కొనాలనేది చాలామంది భావన. అందులోనూ సెడాన్ మోడల్ కూడా కాదు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్యూవీ) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఎస్యూవీ అయితే ఇంటిల్లిపాదీ హాయిగా.. ఎంతదూరమైనా సౌఖ్యంగా ప్రయాణం చేయొచ్చని అంటున్నారు.
ఇక్కడ మళ్లీ ఇంకో పాయింట్ కూడా ఉంది. సాధారణంగా పెట్రోల్ కంటే డీజిల్ చౌక. కాబట్టి గతంలో కార్లు కొనేవాళ్లు డీజిల్ వెర్షన్ని ఎంచుకునేవారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది. డీజిల్ వెర్షన్ కంటే పెట్రోల్ వెర్షన్ వాహనాలనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి కారణం.. వాహన రంగంలో ప్రభుత్వం బీఎస్-6 నిబంధనలు అమలులోకి తీసుకురావడమే.
పెరిగిన పెట్రోల్ వాహనాల విక్రయం...
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అమ్ముడైన అన్ని యుటిలిటీ వెహికల్స్లో 35 శాతం పెట్రోల్తో నడిచే వాహనాలే ఉండడం గమనార్హం. ఏడాది క్రితం వీటి అమ్మకాలు కేవలం 17 శాతమే. ఏడాది తిరిగేసరికి పెట్రోల్ వాహనాల శాతం రెట్టింపు అయింది. అలాగే వచ్చే మరికొన్ని నెలల్లోనూ పెట్రోల్ వాహనాల విక్రయాలే అధికంగా ఉంటాయని వాహనరంగ నిపుణులు చెబుతున్నారు. ఎస్యూవీ మోడల్ కార్లను కొనుగోలు చేసేవారు కూడా వాటిలో పెట్రోల్ వెర్షన్ వాహనాలనే కొంటున్నారు.
పెట్రోల్కు దగ్గరవుతోన్న డీజిల్ ధర...
డీజిల్ ధర క్రమేణా పెట్రోల్ ధరకు దగ్గరవుతుండడం కూడా వాహనదారులను ఆలోచనలో పడవేస్తోంది. గతంలో పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రెండింటి ధరల నడుమ ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది. చాలా నగరాల్లో వీటి మధ్య తేడా కేవలం రూ.5 మాత్రమే. అదే 2012లో డీజిల్, పెట్రోల్ ధరల మధ్య రూ.31 తేడా ఉండేది. ఇంకో విషయం ఏమిటంటే.. గోవా, గుజరాత్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో డీజిల్ ధర పెట్రోల్ని మించిపోతుందనే ఊహతో.. ఇక డీజిల్ వాహనాలు కొని లాభం లేదనే పరిస్థితికి వచ్చేశారు కొనుగోలుదారులు. దీంతో పెట్రోల్ వెర్షన్ వాహనాల కొనుగోలు క్రమంగా ఊపందుకుంటోంది.
బీఎస్-6 నిబంధనల అమలుతో...
డీజిల్తో నడిచే వాహనాల కారణంగా వాయు కాలుష్యం బాగా పెరుగుతోంది. క్రమేణా పర్యావరణం దెబ్బతింటోంది. మరోవైపు విద్యావంతులైన ప్రజలు పర్యావరణ పరిరక్షణ స్పృహతో ఆలోచిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తున్నారు. ఇది కూడా డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గడానికి, పెట్రోల్ వాహనాల అమ్మకాలు పెరగడానికి ఒక కారణం. మరోవైపు ప్రభుత్వం కూడా డీజిల్ వాహనాల నిషేధానికి చర్యలు తీసుకుంటుండడం, త్వరలోనే బీఎస్-6 నిబంధనలు అమలుకు చర్యలు తీసుకుంటుండడం కూడా ప్రజలను ఆలోచింపజేస్తోంది. దీంతో గతంలో కాస్ట్ కటింగ్ గురించి ఆలోచించే వారు సైతం ప్రస్తుతం డీజిల్ వాహనాలు కాకుండా పెట్రోల్తో నడిచే వాహనాలు కొనుక్కోవడమే బెస్ట్ అని భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపైనా ఆసక్తి...
దేశంలోని ప్రజలు కాలుష్య కారకం కాని ఎలక్ట్రిక్ కార్లపైన కూడా మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలను స్థానికంగా తయారు చేసే కంపెనీలకు ‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇటు ప్రభుత్వ ప్రోత్సాహం, అటు కొనుగోలుదారుల ఆసక్తి.. వెరసి దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ వాహనాలు సహా నూతన ఇంధన వాహనాలు(ఎన్ఈవీ) తయారీ, అమ్మకాలు పెరుగుతున్నాయి. హ్యూందాయ్, నిస్సాన్ తదితర సంస్థలతోపాటు దేశీయ సంస్థలు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితర కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అమ్మకాలు సాగిస్తున్నాయి.