ఆశ్చర్యపోయాం, తీవ్ర మనస్థాపం చెందాం: మోడీకి మాజీ అధికారుల లేఖ
పెన్షన్ నిబంధనల మార్పులపై 109 మంది మాజీ సివిల్ సర్వెంట్స్ గ్రూప్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. మారిన నిబంధనలు తమని ఆశ్చర్యానికి గురి చేశాయని, అలాగే, తీవ్ర మనస్థాపానికి గురయ్యామని ఆ లేఖలో పేర్కొన్నారు. మే 31వ తేదీ 2021న మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్స్ అండ్ పెన్షన్ నోటిఫై చేసిన పెన్షన్ నిబంధనలు తమను ఆవేదనకు గురి చేయడంతో పాటు ఆశ్చర్యపోయినట్లు తెలిపింది.
ఎంపిక చేసిన ఇంటెలిజెన్స్ లేదా సెక్యూరిటీ సంబంధిత సంస్థల్లో పని చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పబ్లిష్ చేయాలనుకుంటే ఆ సంస్థ అధిపతి నుండి క్లియరెన్స్ తీసుకోవడాన్ని తాజా సవరణ తప్పనిసరి చేస్తోంది. సంస్థ డొమైన్కు సంబంధించిన అంశాలపై రాయడానికి అనుమతి తప్పనిసరి చేసింది. అసలు ఈ నిబంధన ఎందుకు తీసుకు వచ్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
కొన్ని అంశాల గురించి రాయడం వల్ల తీవ్ర దుష్ప్రమాణాలకు దారితీస్తే చట్టం ప్రకారం సదరు మాజీ అధికారికి లేదా అధికారిణికి పెన్షన్ రద్దు చేసేలా ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవచ్చునని గుర్తు చేశారు. నిబంధనలు మార్చినప్పుడు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా కనిపించడం లేదని పేర్కొన్నారు. కాగా, ఈ లేఖ పైన మాజీ ప్రసార భారతి సీఈవో జవహర్ సిర్కార్, మాజీ ఫారెన్ సెక్రటరీ శ్యామ్ శరన్, మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్లై, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తదితరులు సంతకం చేశారు. 2008లోను యూపీఏ రా, ఐబీలో ఇలాంటి ఉత్తర్వులు ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేసింది.