బ్యాంకులు కొత్త ఎన్పీఏలు ప్రకటించవచ్చు: ఆంక్షల తొలగింపు
రుణ మారటోరియం నేపథ్యంలో కొత్తగా ఎన్పీఏలు ప్రకటించరాదని బ్యాంకులపై విధించిన ఆంక్షలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం ఎత్తివేసింది. రుణ మారటోరియం గడువును పొడిగించడానికి నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పులో భాగంగా నిన్న ఈ ఆదేశాలను జారీ చేసింది. రుణవాయిదాల చెల్లింపుకు రంగం ఆధారిత ఉపశమనాన్ని ఇవ్వలేమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ తీర్పు చెప్పింది.
గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన రుణ మారటోరియం కేసు విచారణ సమయంలో ఆగస్ట్ 31 వరకు ఉన్న ఎన్పీఏలను తదుపరి ఉత్తర్వుల వరకు ప్రకటించరాదని బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిని వెనక్కి తీసుకుంది.
ఇదిలా ఉండగా, బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2020 డిసెంబర్ నాటికి రూ.5.7 లక్షల కోట్లుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఎన్పీఏల వసూలుకు దివాలా చట్టం దోహదం చేసిందని చెప్పారు. స్థూల ఎన్పీఏలు తగ్గాయని, 2018లో రూ.8.96 లక్షల కోట్లు కాగా, 2020 డిసెంబర్ చివరినాటికి రూ.5.7 లక్షల కోట్లకు పరిమితమయ్యాయని తెలిపారు. రూ.2.74 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలైనట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో అధిక ఎన్పీఏలకు దారి తీసే మోసాలు కూడా తగ్గినట్లు చెప్పారు. ఎన్పీఏలకు దారి తీసిన మోసాల ఘటనలు 2013-14లో 1.01 శాతం కాగా, ఇప్పుడు 0.23 శాతానికి తగ్గాయి.