RBI: పాత 500, 1000 నోట్లు ఇప్పుడు మార్చుకోవచ్చా..? సుప్రీం కోర్టు ఏమందంటే..
మోదీ సర్కార్ 2016లో అకస్మాత్తుగా నోట్ల రద్దును ప్రకటించింది. అప్పట్లో ఇది పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. ప్రభుత్వం అప్పుడు 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. వాటిని బ్యాంకుల వద్ద జమచేసి మార్చుకోవాలని సూచించింది. అయితే ఆ సమయంలో చాలా మంది నోట్లను మార్చుకున్నప్పటికీ.. కొంత మంది వద్ద మాత్రం అవి మిగిలిపోయాయి.
సుప్రీంకు వ్యవహారం..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. పాత నోట్లను మార్చుకోవాలనుకుంటున్న వ్యక్తుల వ్యాజ్యాలపై శుక్రవారం విచారణ జరిగిపిన ధర్మాసనం ఆర్బీఐకి కీలక సూచన చేసింది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా..
పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ నోట్లను మార్చుకోలేక పోయిన వారికి పరిష్కార మార్గాన్ని ఆలోచించగలరా అంటూ ధర్మాసనం రిజర్వు బ్యాంకును కోరింది. అయితే నిజాయితీగా, సరైన కారణాలతో అప్పట్లో డబ్బు డిపాజిట్ చేయలేకపోయిన వారి కేసుల విషయంలో పరిష్కారాన్ని అన్వేషిచాలని సూచించింది. అలాంటి వారికి మాత్రం ఇప్పుడు వెసులుబాటు కల్పించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని రిజర్వు బ్యాంకును సుప్రీం కోర్టు కోరింది. కోమాలో ఉన్న ఒక మహిళ తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోలేక పోవటం విషయం ఈ క్రమంలో చర్చించబడింది.
అటార్నీ జనరల్ సమాదానం..
అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బదులిస్తూ.. నోట్ల రద్దు తేదీని పొడిగించలేమని తేల్చి చెప్పారు. అయితే రిజర్వు బ్యాంక్ కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా తమవద్దే పాత నోట్లను కలిగి ఉన్న వారు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని సుప్రీం కోర్టు వెల్లడించింది.
స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టంలోని చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన గ్రేస్ పిరియడ్ లోపు రద్దైన నోట్లను జమచేయలేకపోయిన వారి విషయంలో ఆర్బీఐ సొంత విచక్షణతో పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేయటం జరిగింది.