నూనెలపై గుడ్న్యూస్: వెంట నూనెల నిల్వలపై పరిమితి, ఎందుకంటే
వంట నూనెల లభ్యతను మెరుగుపరచడం, ధరలను నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితిని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఈ పరిమితులు వచ్చే ఏడాది (2022) మార్చి 31వ తేదీ వరకు ఉంటాయి. ఇప్పటికే ఎన్సీడీఈఎక్స్ సూచీలో ఆవనూనె ఫ్యూచర్ ట్రేడింగ్ను ప్రభుత్వం నిషేధించింది.
ఈ చర్యలతో ధరలు అదుపులో ఉంటాయని, ఇది కస్టమర్లకు కొంత ఊరట కలిగిస్తుందని కేంద్రం వెల్లడించింది. ఇకపై స్టాక్ పరిమితిని నిర్దేశిస్తూ అక్రమ నిల్వల సమస్యను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
గత ఏడాది వ్యవధిలో వంటనూనెల ధరలు 46.15 శాతం పెరిగాయి. అంతర్జాతీయస్థాయిలో ధరల పెరుగుదలతో పాటు దేశీయంగా సరఫరాలో సమస్యల వల్ల ధరలు కొండెక్కాయి. అయితే, కస్టమర్లకు ఊరట కల్పిస్తూ ఇటీవల కేంద్రం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. కానీ, కొంతమంది వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో కేంద్ర చర్యలు చేపట్టింది.
ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమలులోకి తీసుకు రావాలని ఆహార మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ ఆదేశించింది. కేంద్రం నిర్ణయం దేశీయ మార్కెట్లో తినదగిన నూనెల ధరలను ఈజీ చేస్తోందని, తద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని ఆ శాఖ తెలిపింది.