రియల్ ఎస్టేట్కు పన్ను ఊరట: ఇళ్ల ధరలు తగ్గుతాయా? ఇద్దరికీ ప్రయోజనమే..
రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెంచడానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో భాగంగా పలు చర్యలు ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థక కార్యకలాపాలు మందగించాయి. దీంతో మార్చి నుండి కేంద్రం ప్యాకేజీలు ప్రకటిస్తోంది. తాజాగా ఒత్తిడిలోని 26 రంగాలతో పాటు మరిన్ని చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ డిమాండ్ పెంచేందుకు కొత్త విధానాలను అమలు చేస్తోంది కేంద్రం. కేంద్రం చర్యలతో ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రం, ఆర్బీఐ ప్యాకేజీ రూ.30 లక్షల కోట్లు, జీడీపీలో 15%: ఉద్యోగాల కల్పనకు ఊతం...
పన్ను రాయితీతో ధరలు మరింత దిగి వచ్చే ఛాన్స్
ఆదాయపు పన్ను రాయితీలతో నగదు లభ్యత సంక్షోభం ఎదుర్కొంటున్న హౌసింగ్ డెవలపర్లు ఇళ్ళ ధరల్ని తగ్గించి, త్వరగా విక్రయించేందుకు అవకాశం ఏర్పడుతుందని రియల్ ఎస్టేట్ సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే కరోనా కారణంగా డిమాండ్ లేమి కారణంగా బిల్డర్లు ఇళ్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే తగ్గించిన ధరలకు తోడు తాజా పన్ను రాయితీ జత కలవడంతో మరింత తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఆదాయపు పన్ను సడలింపు..
రూ.2 కోట్ల వరకు విలువైన ఇళ్లను తొలిసారిగా విక్రయిస్తున్నప్పుడు స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటును 20 శాతం కంటే దిగువకు అనుమతించేలా ఆదాయపు పన్ను నియమాలను గురువారం సడలించింది. మొదటిసారి కొనుగోలు చేసేవారికి 20 శాతం వరకు ఆదాయపు పన్ను ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుత చట్టం సర్కిల్ రేటు, ఒప్పంద విలువ మధ్య అంతరాన్ని పది శాతానికి పరిమితం చేస్తోంది. ఈ సడలింపులు 2021 జూన్ 30 వరకు అమలులో ఉంటాయి. అమ్ముడుపోని ఇళ్లను విక్రయించేందుకు దోహదపడుతుంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 7 లక్షల వరకు అమ్ముడుపోని రెసిడెన్షియల్స్ ఉన్నట్లు అంచనా.
సర్కిల్ రేటు పెంపు
సర్కిల్ రేట్లు, ఒప్పంద వ్యాల్యూ మధ్య వ్యత్యాసాన్ని 10 శాతం నుండి 20 శాతానికి పెంచడం ద్వారా అటు డెవలపర్లు, ఇటు ఇళ్ల కొనుగోలుదారులు లబ్ధి పొందుతారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు భావిస్తున్నారు. 2021 జూన్ 30 వరకు రూ.2 కోట్ల విలువైన విక్రయాలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకు సర్కిల్ రేటు కంటే 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ విలువతో ఏదైనా ఒప్పందం జరిగితే రెండు పార్టీలపై అదనపు పన్ను భారం ఉండేది. ఇప్పుడు 20 శాతానికి పెంచడంతో కొనుగోలుదారులు, డెవలపర్లకు ఉపశమనం కల్పించడం వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ను మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు.
స్వాగతించిన రియాల్టర్లు
ఆదాయపు పన్ను నిబంధనలతో బిల్డర్లు ఇళ్ళ ధరలు తగ్గించేందుకు వెనుకాడుతున్నారని గతంలోనే క్రెడాయ్, నారెడ్కో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకు వచ్చిన పన్ను రాయితీలను స్వాగతించాయి.
అందరికీ ఇళ్లు స్కీంలో భాగంగా పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా మరో రూ.18000 కోట్లను కేటాయించడం ద్వారా తొలిసారి ఇళ్లు కొనుగోలు చేసే వారికి లబ్ధి చేకూరడంతో పాటు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సాయం అందించినట్లు అవుతుందని, ఈ అదనపు వ్యయం వల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపారు. వాస్తవ అమ్మకపు ధర, స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ మధ్య పరిమితిని 10 శాతం నుండి 20 శాతానికి పెంచడం ద్వారా డెవలర్లకు ఉద్దీపన ఇవ్వడం స్వాగతించదగ్గ చర్య అని చెబుతున్నారు.