భారీగా పెరిగిన స్టీల్ ధరలు తగ్గుతాయా, ఎప్పుడు?
వివిధ కారణాల వల్ల ఇటీవల స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. కరోనా తర్వాత నిర్మాణ రంగం క్రమంగా పుంజుకుంటోంది. దాదాపు రెండేళ్ల పాటు ఇంటి నిర్మాణం వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్టీల్ ధరలు మాత్రం తగ్గుముఖం పట్టవచ్చునని క్రిసిల్ అంచనా వేసింది.
గత నెలలో టన్ను స్టీల్ ధర రూ.76వేలకు చేరుకుంది. 2023 మార్చి నాటికి ఈ ధర రూ.60 వేలకు దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలు ఇంకా కొనసాగుతుండటం, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం, కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి వివిధ దేశాలు చర్యలు చేపట్టడంతో ముడి సరుకు ధరలు పెరిగాయని క్రిసిల్ తెలిపింది.
వర్షాకాలం సమయంలో నిర్మాణాలు నెమ్మదించి స్టీల్కు డిమాండ్ తగ్గుతుందని, స్టీల్ ధరలు తగ్గుముఖం పట్టవచ్చునని పేర్కొంది. దేశీయంగా ఉన్న మిల్లులకు సరిపడా దిగుమతులు కూడా అందుతాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి స్టీల్కు డిమాండ్ తగ్గుతుందని క్రిసిల్ పేర్కొంది. నిర్మాణ వ్యయం పెరగడం వల్ల ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో వినియోగదారు వాయిదాకు మొగ్గు చూపుతారని, ఇది డిమాండ్ తగ్గడానికి కారణమవుతుందని క్రిసిల్ పేర్కొంది. ఇతర దేశాల్లో కూడా స్టీల్ ధరలు భారీగానే పెరిగినట్లు తెలిపింది.