రాష్టాల అప్పులతో కేంద్రానికి తిప్పలు... ఎందుకంటే!
భారత దేశం సమాఖ్య రాజ్యం. రాష్ట్రాలతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలో అప్పులు చేస్తుంటాయి. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం కేంద్రం అప్పులు చేస్తోంది. అలాగే ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో అభివృద్ధి కొరకు, ప్రోజెక్టుల నిర్మాణం కొరకు కూడా రుణాలు తీసుకొంటాయి. అయితే కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి.
వీటికి సహజంగా కేంద్ర ప్రభుత్వం గారంటే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రం ఎంత మేరకు అప్పులు చేయవచ్చొ ఎఫ్ఆర్బిఎం ద్వారా నిర్ణయిస్తుంది. వాటికి కొంత పరిధిని కేటాయిస్తుంది. అలాగే తనకు కూడా సొంతంగా ఒక స్థాయికి మించి అప్పులు చేయకూడదని పరిమితిని పెట్టుకుంటుంది. రుణాలు పెరిగితే రాష్ట్రాలైనా... కేంద్ర ప్రభుత్వానికైనా ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిషిట్) పెరిగి పోతుంది. దీనిని కట్టడి చేస్తేనే విదేశాల నుంచి అవసరమైనప్పుడు మరింతగా రుణాలు తీసుకొనే వెసులుబాటు లభిస్తుంది. అయితే, ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రాష్త్ర అప్పులు తగ్గక పోగా పెరిగిపోతున్నాయి. ఈ పరిణామం కేంద్రానికి తలనొప్పిగా మారిపోతోంది.
వంటింట్లో నూనెల సెగ... ధరలు మండిపోనున్నాయ్.... కారణం ఏమిటంటే
ద్రవ్య లోటు పెరుగుతుంది...
దేశంలో ఆర్థిక వృద్ధి రేటు పడిపోతున్నపుడు, మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు పెడుతున్నప్పుడు సహజంగానే ద్రవ్య లోటు పెరిగిపోతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. ప్రస్తుతం భారత దేశంలోని రాష్ట్రాల ద్రవ్య లోటు అందుకే పెరుగుతోందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించుకున్న ద్రవ్య లోటు టార్గెట్ 3.3% కు తగ్గించటం కష్టమేనని చెప్పింది. బదులుగా భారత దేశ ద్రవ్య లోటు 3.7% వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఫిస్కల్ కన్సాలిడేషన్ సాధించేందుకు మరింత అధిక కాలం కష్టపడాల్సి ఉంటుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ జీజార్జి జోసేఫాప్ వ్యాఖ్యానించారు. ఆ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.
రూ 7.5 లక్షల కోట్ల అప్పులు...
దేశంలోని రాష్ట్రాలు అన్ని అభివృద్ధి కంటే కూడా అప్పులు చేయటంలో తెగ పోటీ పడుతున్నాయి. ఒక్క గత ఆర్థిక సంవత్సరం (2018-19) లోనే మన దేశంలోని రాష్ట్రాలు అన్ని కలిసి ఏకంగా రూ 7.5 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాదితో పోల్చితే అప్పులు 28% పెరిగాయని మూడీస్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మేరకు సొంత ఆదాయాలను సమకూర్చుకోలేక పోతున్నాయని మూడీస్ గుర్తించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అవి కేంద్ర ప్రభుత్వం మీద మరింత అధికంగా ఆధారపడేలా పరిస్థితులు తయారు అయ్యాయని జోసేఫాప్ పేర్కొన్నారు. జీఎస్టీ అమలు చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల సొంత రెవిన్యూ 52% నుంచి 44% నికి పడిపోయిందని వెల్లడించారు. దీంతో రాష్ట్రాలు ప్రతి అవసరానికి కేంద్రం వైపు చూస్తున్నాయి. లేదా కొత్త అప్పులు చేస్తున్నాయి.
విధానాలు మారాలి...
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు మారకపోతే ప్రస్తుత పరిస్థిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశాలు లేవని మూడీస్ నివేదిక పేర్కొంటోంది. తద్వారా ప్రభుత్వ ద్రవ్య లోటు 3.7% మేరకు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయటం కొనసాగిస్తే జీడీపీ లో మొత్తం లోటు 6.7% వరకు ఉంటుందని, అది ద్రవ్యలోటు తగ్గేందుకు ఆటంకంగా మారుతుందని తెలిపింది. గతంలో కంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై అధికంగా ఆధారపడటం తెలివైన నిర్ణయంగా లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ - కాశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో సహజంగానే సొంత టాక్స్ రెవిన్యూ తక్కువగా ఉంటుందని, అవి ప్రస్తుతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంపైనే ఆధారపడాల్సి వస్తోందని మూడీస్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని తగిన చర్యలు చేపట్టకపోతే... అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు గడ్డు పరిస్థితులేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.