FY22లో రాష్ట్రాలకు రూ.3 లక్షల కోట్ల జీఎస్టీ కంపెన్షేషన్ కోత!
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంగా అంచనా వేసిన మొత్తం రూ.1.10 లక్షల కోట్లను విడుదల చేశామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది. ఇరవయ్యవ విడతగా చివరి వారంలో రూ.4,104 కోట్లను ఇచ్చామని, దీంతో రూ.1,10,208 కోట్లకు చేరుకుందని తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుండి వారానికోసారి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేస్తామని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం షార్ట్ ఫాల్ రూ.3 లక్షల కోట్లుగా ఉండవచ్చునని ఓ నివేదిక తెలిపింది.
రూ.3 లక్షల వరకు షార్ట్ ఫాల్
రాష్ట్రాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2.7 లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల వరకు జీఎస్టీ పరిహారం తగ్గవచ్చునని సదరు నివేదిక తెలిపింది. ఇందులో సెస్ కలెక్షన్ల తగ్గుదలనే రూ.1.6 లక్షలకోట్ల నుండి రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని సోమవారం నాటి ఈ నివేదిక వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్ల జీఎస్టీ పరిహారం షార్ట్ ఫాల్ ఎదుర్కొంటోందని, అయితే ఇందులో 90 శాతం క్లియర్ అయ్యాయి.
రాష్ట్రాల రుణాలు
ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం షార్ట్ ఫాల్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు మార్కెట్ నుండి రూ.2.2 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకునే పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. ఇలా తీసుకున్న రుణాల్లో FY22లో 90 శాతం రుణాలను ఉపయోగించాలి. కేంద్ర ప్రభుత్వం FY22 జీడీపీ అంచనాల ఆధారంగా రాష్ట్రాలు 1 శాతం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GSDP) లేదా రూ.2.2 లక్షల కోట్ల వరకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి అని తెలిపింది.
జీఎస్టీ వాటాలో కోత
ఇదిలా ఉండగా, కరోనాతో రెవెన్యూ వసూళ్లు పడిపోవడంతో కొంతకాలంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తున్న జీఎస్టీ వాటాల్లో కోతకు తెరపడనుంది. 4 నెలలుగా జీఎస్టీ వసూళ్లు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న జీఎస్టీ ఆదాయ కొరత రూ.40 వేల కోట్ల మేర తగ్గే అవకాశముందని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు గతంలో తెలిపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు భారీగా తగ్గవచ్చునని కూడా భావించారు. అయితే 14 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని అందుకోవడం కష్టమని అంటున్నారు.