ఇండియా సావరిన్ రేటింగ్ మార్చని ఎస్అండ్పీ: పనితీరు చెక్కుచెదరదని విశ్వాసం
న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) భారత సార్వభౌమ రేటింగ్(సావరేన్ రేటింగ్)ను బీబీబీ-ఏ3నే స్థిరంగా ఉంచింది. కరోనా ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉందని, కరోనాతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది ఈ గ్లోబల్ రేటింగ్ సంస్థ.
ప్రస్తుతం ఎలావున్నా రాబోయే రోజుల్లు పురోగతి..
ఈ ఆర్థిక సంవత్సరం భారీ మొత్తంలో ఏర్పడిన ఆర్థిక లోటు వచ్చే మూడేళ్లలో సర్దుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ 2021 నుంచి కోలుకుంటుందని ఎస్అండ్ పీ పేర్కొంది. గత నెలలో మరో రేటింగ్ సంస్థ మూడీ భారత సావరేన్ రేటింగ్ను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. తక్కువ వృద్ధి రేటు, ఆర్థిక సంక్షోభం లాంటి ప్రభుత్వ విధానాలకు సవాళ్లుగా మారాయని పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ రాబోయే రోజుల్లో పురోగతి సాధిస్తుందని వెల్లడించింది దీర్ఘకాలికానికి బీబీబీ, షార్ట్ టర్మ్ ఫారెన్కు ఏ-3, స్థానిక కరెన్సీ సావరేన్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నాయని ఎస్అండ్ పీ తెలిపింది.
రేటింగ్ పెరిగే అవకాశం..
ఒకవేళ భారత ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలను అవలంభించి సంక్షోభాన్ని అధిగమిస్తే రేటింగ్స్ పెరిగే అవకాశం ఉందని ఎస్అండ్పీ తెలిపింది. దీని ఫలితంగా సాధారణ ప్రభుత్వ స్థాయిలో నికర రుణాలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో కఠినమైన రుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. క్రెడిట్ వృద్ధి క్రమంగా క్షీణించడంలో ఇది ప్రతిబింబిస్తుంది, ఇది బ్యాంకుల డిమాండ్, పరిమిత రిస్క్ కారణంగా బలహీనంగా ఉండే అవకాశం ఉందని ఎస్ అండ్ పి తెలిపింది.
భారత పనితీరుపై విశ్వాసం..
కరోనా సంక్షోభం ప్రారంభమైన తర్వాత నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్(ఎన్బీఎఫ్ఐ) సెక్టార్లో కూడా కొన్ని ప్రాంతాలు కూడా నగదు సమస్యలను ఎదుర్కొన్నాయని తెలిపింది. ప్రభుత్వ విధానాలు బ్యాంక్ వ్యవస్థ, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ సెక్టార్లకు కూడా మద్దతు తెలిపేలా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థ సమీప కాలంలోనే అన్ని సవాల్లను ఎదుర్కొంటుంది. ఏది ఏమైనా భారత దీర్ఘ కాలిక పనితీరు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది.