కరోనా ఎసెన్షియన్ ఐటమ్స్పై పన్ను తగ్గింపు అంశం, రేపు జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ శనివారం (జూన్ 12) భేటీ కానుంది. కోవిడ్ ఎస్సెన్షియల్ ఐటమ్స్పై ట్యాక్స్ కట్ కోతకు సంబంధించి చర్చించనున్నారు. కోవిడ్ ఎస్సెన్షియల్స్తో పాటు బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కూడా ఈ అజెండాలో ఉంది. గత నెల చివరలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు, ఔషధ పరికరాలపై పన్ను మినహాయింపు అంశంపై చర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ సంఘం(GoM) నివేదికను సమర్పించింది.
ఈ నేపథ్యంలో శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతోంది. కరోనా వ్యాక్సీన్స్, ఇతర ఔషధాలు, అత్యవసర చికిత్స వస్తువులు, బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్కు సంబంధించి పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కరోనా చికిత్సకు ఉపయోగించే పీపీఈ కిట్స్, మాస్క్లు, వ్యాక్సీన్స్ తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని మే 28వ తేదీన జరిగిన సమావేశంలో కౌన్సిల్ సభ్యులు కోరారు.
వీటిపై పన్ను మినహాయింపుకు సంబంధించిన అంశంపై అధ్యయనానికి మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలో GoM ఏర్పాటయింది. ఇందులో తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. ఏడో తేదీన నివేదిక సమర్పించారు. పన్ను తగ్గింపుపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లను అంగీకరించాలి. ప్రస్తుతం దేశీయ వ్యాక్సీన్ పైన 5 శాతం జీఎస్టీ, కరోనా మెడిసిన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ ఉంది.