srilanka crisis: రుణాలు చెల్లించలేక దివాళా.. వేడుకలకు మాత్రం 20 కోట్లు ఖర్చు
srilanka crisis: పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడం, దివాళా స్థితికి వెళ్లడం మనకు తెలిసిందే. ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సహాయాన్ని కోరింది. అందుకు IMF కొన్ని షరతులు విధించింది. ఇప్పుడు ఆ సంస్థ సూచించిన వాటన్నిటినీ పూర్తి చేసినట్లు దేశ అధ్యక్షులు రణిల్ విక్రమసింఘే తెలిపారు.
బెయిలౌట్ కోసం వెయిటింగ్:
శ్రీలంక 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విక్రమ సింఘే దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 2.9 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ను IMF నుంచి పొందేందుకు అవసరమైన ముందస్తు పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. త్వరలోనే రుణం మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు జరుపుతున్నందున.. ఈ ఏడాదిలో తిరిగి ఇవ్వాల్సిన దాదాపు 7 బిలియన్ డాలర్ల విదేశీ రుణాల చెల్లింపును ఆ దేశం నిలిపివేసింది.
దివాళా తీసినా, భారీ ఖర్చుతో వేడుకలు:
స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నా.. చాలా మంది పౌరులు కోపంగా, వేడుకలు జరుపుకునే ఉత్సాహం లేకుండా ఉన్నారు. ఈ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క దివాళా స్థితిలో ఉండి, 200 మిలియన్ రూపాయలు ఖర్చు చేసి స్వాతంత్య్రాన్నిఎలా సగర్వంగా జరుపుకుంటామని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పరిస్థితి మారుతోంది..
చైనా, జపాన్ ల నుంచి రుణాల రీస్ట్రక్చరింగ్ పొందడంపై లంక ప్రస్తుతం దృష్టి సారించింది. మన దేశం మాత్రం గత నెలలో రుణ పునర్వ్యవస్థీకరణకు ఓకే చెప్పింది. 2023 ద్వితీయార్థం నాటికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ భావిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం సింగిల్ డిజిట్ కు చేరుతుందని అంచనా వేసింది.
ఇదీ లంక పరిస్థితి:
లంక మొత్తం విదేశీ రుణం 51 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. ఇందులో 28 బిలియన్లను 2027 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. మోయలేని రుణభారం, ఫారెక్స్ రిజర్వుల సంక్షోభం, కరోనా మిగిల్చిన ఇబ్బందులు వెరసి నిత్యావసర వస్తువుల తీవ్ర కొరతకు దారితీసింది. ఇంధనం, ఔషధాలు, ఆహారం వంటివి దొరికే పరిస్థితి లేదు. గతేడాది జరిగిన భారీ నిరసనల కారణంగా.. విక్రమసింఘే పూర్వం అధికారంలో ఉన్న గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
ఇవీ ప్రభుత్వం చర్యలు:
దేశంలో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా.. ఆదాయపు పన్నులను ప్రభుత్వం భారీగా పెంచింది. ప్రతి మంత్రిత్వ శాఖకు కేటాయించే నిధుల్లో 6 శాతం కోత విధించింది. సుదీర్ఘ అంతర్యుద్ధం కారణంగా 2 లక్షలకు పైగా సైన్యాన్ని సమీకరిచింది. అయితే 2030 నాటికి దాదాపు సగానికి తగ్గించేందుకు చూస్తోంది.