శ్రీలంక ఆర్థిక సంక్షోభం, భారత గార్మెంట్స్ యూనిట్లకు ప్రయోజనం!
శ్రీలంక ఆర్థిక సంక్షోభం భారత గార్మెంట్స్ యూనిట్కు స్వల్పంగా ప్రయోజనం చేకూర్చవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. దారుణమైన ద్రవ్యోల్భణం కనిపిస్తోంది. స్థానిక కరెన్సీ ప్రకారం గుడ్డు రూ.35 దాటింది. ఏ నిత్యావసరం చూసినా ఆకాశాన్ని తాకుతోంది. ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసి, ప్రజలను అగాధంలోకి నెట్టివేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. అయితే ప్రస్తుత శ్రీలంక ఆర్థిక సంక్షోభం భారత గార్మెంట్స్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు.
డీజిల్ కొరత, విద్యుత్ కొరత
శ్రీలంకలో అనేక గంటల పాటు విద్యుత్ కోత, డీజిల్ కొరత, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది శ్రీలంకలో హాజరీ ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపుతోంది. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో భారత గార్మెంట్స్ పరిశ్రమకు కాస్త ప్రయోజనం చేకూరవచ్చునని, అయితే పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించడం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
తిరుప్పూర్ ఎగుమతిదారుల సంఘం (TEA) ప్రెసిడెంట్ రాజా ఎ షణ్ముగం కూడా భారత్లో ఉత్పత్తి స్థావరాలు కలిగి ఉన్న శ్రీలంక గార్మెంట్ కంపెనీలు తమ భారతీయ యూనిట్ల నుండి తమ ఆర్డర్స్ను కొనసాగించవచ్చునని చెబుతున్నారు. విద్యుత్ కొరత, డీజిల్ కొరత గార్మెంట్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతోంది.
పత్తిపై దిగుమతి సుంకం
కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తుందని ఆశతో ఉన్నామని, ఇతర దేశాలకు ఉత్పత్తి పరిమితులు ఉన్నందున కొన్ని స్పిల్ ఓవర్ ఆర్డర్స్ భారతీయ వస్త్ర తయారీదారులకు రావొచ్చునని చెబుతున్నారు. 11 శాతం దిగుమతి సుంకం కారణంగా వ్యాపారాలు ధరలు పెంచుతున్నారని, దీంతో దేశీయ గార్మెంట్స్ యూనిట్లు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడటానికి ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
కొన్ని శ్రీలంక గార్మెంట్ యూనిట్లు భారత్లో తమ ఉత్పత్తి అనుబంధ సంస్థలను కలిగి ఉన్నాయని, అలాంటి కంపెనీలు తమ ఆర్డర్స్ను భారతీయ యూనిట్ల ద్వారా అమలు చేయవచ్చునని అంటున్నారు.
లంకలో భారీగా ధరలు
భారతీయ మార్కెట్ కోసం దాదాపు రూ.32,000 కోట్ల విలువైన వస్త్రాలు, రూ.30,000 కోట్ల విలువైన ఉత్పత్తులకు తిరుప్పూర్ హాజరీ క్యాపిటల్గా పేరుగాంచింది. శ్రీలంక గార్మెంట్ ఆర్డర్స్ను భారత్కు మళ్లించే అవకాశముందని భావిస్తున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా పదహారుమంది లంకేయులు తమిళనాడులో అడుగు పెట్టినట్లుగా తెలుస్తోంది. నిత్యావర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారని లంక అధికారులు చెబుతున్నారు.