ఆస్తులకు ఆధార్ లింక్!: మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!? లాభాలెన్నో...
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్370, ట్రిపుల్ తలాక్ వంటి అనేక నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆర్థిక మందగమనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రంగాలకు అనేక ఉద్దీపనలు ప్రకటించింది. సామాన్యులకు వివిధ వివిధ పథకాలు ప్రకటిస్తూనే అక్రమార్కుల ఆటకట్టించేందుకు పలు కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. నోట్ల రద్దు ముఖ్య ఉద్దేశ్యాల్లో ఒకటి అక్రమార్కులను అడ్డుకోవడం. ఇటీవల బంగారం పరిమితి అంటూ ప్రచారం సాగింది. దీనిని కేంద్ర ప్రభుత్వ అధికారులు కొట్టి పారేశారు. తాజాగా మరో ఆస్తులకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
శుభవార్త: వాయిస్ కాల్, మొబైల్ డేటాకు కనీస ధర
కేంద్రం మరో కీలక నిర్ణయం
ఆస్తులను ఆధార్ కార్డుతో లింక్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. నల్లధనం, హవాలా ట్రాన్సాక్షన్స్ను అరికట్టేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని, బినామీ ఆస్తుల ట్రాన్సాక్షన్స్ను అడ్డుకునేందుకు ఓ కొత్త చట్టాన్ని తేనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయట. ఇందుకు సంబంధించి గత మూడేళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. త్వరలో ఇవి వాస్తవం కావొచ్చునని అంటున్నారు.
బినామీలు బట్టబయలు
స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కేంద్రం ఓ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తోందని, ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం వాస్తవరూపం దాలిస్తే దేశంలో బినామీలు బట్టబయలవుతారని భావిస్తున్నారు.
పారదర్శకత.. ధరల తగ్గుదల
బినామీలు బట్టబయలు కావడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. స్థిరాస్తి ట్రాన్సాక్షన్స్లో పారదర్శకత పెరుగుతుందని చెబుతున్నారు. భూములు, ఇళ్ల ధరలు తగ్గవచ్చునని అంటున్నారు. ఈ చట్టం తీసుకు వస్తే చాలామంది తమ అక్రమాస్తులు వదిలించుకునే అవకాశాలు లేకపోలేదని, అప్పుడు ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. ఒకే ఇంటిని లేదా స్థలాన్ని ఇద్దరు లేదా ముగ్గురికి అమ్మే బ్రోకర్లను అరికట్టవచ్చు.
మోసాలు తగ్గుతాయి
ఆధార్ కార్డుతో స్థిరాస్తి యాజమాన్యాన్ని అనుసంధానం చేస్తే బ్లాక్ మనీ బయటకు వస్తుందని అంటున్నారు. అలాగే రియల్ రంగంలో జరుగుతున్న మోసాలు తగ్గుతాయని అంటున్నారు. ఇలాంటి చట్టం వస్తే అందరికీ ఎంతో ప్రయోజనకరమని అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం తీసుకు వస్తే.. ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న నల్లధనం అరికట్టడంతో పాటు, సామాన్యులకు అందుబాటులోకి ఇళ్లు, స్థలాల ధరలు వస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ చట్టం తెస్తే రియల్ రంగంలో నల్లధనం చేతులు మారడం నిలిచపోతుందని చెబుతున్నారు.
అందరికీ ఇళ్ళుకు నినాదానికి ఉత్సాహం
2022 నాటికి అందరికీ ఇళ్ళు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఈ చట్టం తీసుకు వస్తే ఈ నినాదానికి మరింత ఉత్తేజంగా మారుతుంది. ఆస్తులను ఆధార్తో అనుసంధానిస్తే బినామీ లావాదేవీలు పూర్తిగా తగ్గి పారదర్శకత పెరిగి అందరికీ ఇళ్లు లభించే అవకాశముంటుందని భావిస్తున్నారు.
బినామీ ట్రాన్సాక్షన్స్ వెలుగులోకి..
ప్రాపర్టీతో ఆధార్ అనుసంధాన చట్టం వచ్చాక అప్పటి నుంచే జరిగే ట్రాన్సాక్షన్లకే పరిమితం చేయడం కాకుండా ఇది వరకు ఉన్న వాటికి కూడా వర్తింప చేయనున్నారట. దీంతో బినామీ ట్రాన్సాక్షన్స్ వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. కంపెనీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో కీలక మార్గదర్శకాలు ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ చరిత్ర, ఓవర్ ట్రాక్ రికార్డ్ వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటారట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్స్ ఆధార్ ఆధారంగా జరుగుతున్నాయి.
సానుకూల ప్రభావం
దేశవ్యాప్తంగా ఏకీకృత చట్టం తేవడం ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే బినామీలకు చెక్ పడుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాపర్టీకి ఆధార్ నెంబర్ అటాచ్ అయితే వారి పేరున ఎంత మొత్తం ఆస్తి ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ కాస్త ట్రాన్సుపరెంట్ అవుతాయి. దీంతో రియల్ రంగంలో అక్రమాలను నిర్మూలించవచ్చు. మొత్తానికి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే గృహ నిర్మాణ రంగంపై సానుకూల ప్రభావం ఉంటుందని, మార్కెట్ జోరందుకుంటుందని చెబుతున్నారు.