Railway News: సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డులు.. ముక్కు పిండి రూ.200 కోట్లు వసూలు..!
South Central Railway: రైల్వేలు దేశంలోని చాలా కీలక రవాణా వ్యవస్థల్లో ప్రధానమైనది. అయితే ప్రభుత్వం ద్వారా నియంత్రించబడే ఈ వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారి ఆటలు కట్టించటం ద్వారా కూడా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పొందుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్ చెకింగ్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో రూ.200.17 కోట్ల ఆదాయాన్ని వసూలు చేసింది. శనివారం SCR విభాగం ఈ వివరాలను వెల్లడించింది. టిక్కెట్ లేకుండా ప్రయాణించటం, బుక్ చేయని లగేజీలపై ఆర్థిక సంవత్సరం మెుత్తంగా 28.27 లక్షల కేసులు నమోదయ్యాయని రైల్వే శాఖ వెల్లడించింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే ఇలాంటి కేసుల ద్వారా రూ.154.29 కోట్లను ఆర్జించింది. తాజా ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్ తనిఖీ ఆదాయంతో పాటు ప్రయాణికుల ద్వారా రూ.4,825.72 కోట్లను ఆర్జించి రికార్డు సృష్టించింది. ప్రయాణికులకు టిక్కెట్ కొనుగోలు కోసం రద్దీని తగ్గించేందుకు యూటీఎస్ ముబైల్ యాప్, బుకింగ్ కౌంటర్ల వద్ద ఏటీవీఎం మెషిన్లు వంటి మార్గాల ద్వారా టిక్కెట్ కొనుగోలుకు చర్యలు చేపడుతున్నట్లు రైల్వేలు వెల్లడించింది.
రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించటంపై సిబ్బందితో పాటు అధికారులను SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. టికెట్ చెకింగ్ అనేది ఒక పటిష్టమైన మెకానిజం, అది రైల్వే సానుకూల ఇమేజ్ని మెరుగుపరచడంతో పాటు అక్రమ ప్రయాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.