పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ విక్రయాలు, సగటు ధర రూ.15,000 దిశగా
దేశంలో స్మార్ట్ ఫోన్ విక్రయాలు జోరుగా ఉన్నాయి. 2020 జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో 10 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక ఆరు నెలల కాలంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. మొత్తం మొబైల్ మార్కెట్లో శాంసంగ్ 19 శాతం వాటాతో లీడర్గా నిలిచింది. అయితే అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం 27 శాతం వాటాతో చైనాకు చెందిన షావోమీ మొదటిస్థానంలో ఉంది. కరోనా, లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం వంటి వివిధ కారణాలతో గత ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. మార్కెట్ను తిరిగి గాడిలో పెట్టేందుకు కంపెనీలు రంగంలోకి దిగాయి. దీంతో రెండో అర్ధ సంవత్సరంలో సేల్స్ పెరిగాయి.
ప్రస్తుత ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి పది శాతం నమోదు కావొచ్చునని అంచనాలు ఉన్నాయి. 5జీ మోడల్ విక్రయాలు పది రెట్లు పెరిగి 3 కోట్ల యూనిట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బేసిక్ ఫోన్ యూజర్లు కూడా స్మార్ట్ ఫోన్ వైపు మరలుతున్నారు. అన్ని ధరల్లోను ఆకట్టుకునే ఫీచర్లతో ఎన్నో మోడల్స్ వస్తున్నాయి. ఇవి కూడా రూ.20వేల లోపు, రూ.10వేల లోపు వస్తున్నాయి. దీంతో యూజర్లు స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
2020లో స్మార్ట్ఫోన్ సగటు విక్రయ ధర రూ.13,000గా ఉంది. ప్రస్తుతం ఇది రూ.14,000 లకు చేరినట్లు చెబుతున్నారు. సగటు విక్రయ ధర రూ.15వేలకు పెరగవచ్చునని భావిస్తున్నారు. 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. 58 శాతం వాటాతో వన్ ప్లస్ ముందు ఉంది. ఆ తర్వాత యాపిల్ 20 శాతం ఉంది. 2020 అక్టోబర్-డిసెంబర్ కాలంలో శాంసంగ్ వాటా 20 శాతంగా ఉంది.