మందగమనం షాక్: దక్షిణాదిన అందులో ఆంధ్రప్రదేశ్ వరస్ట్, తెలంగాణ కాస్త బెస్ట్!
అమరావతి/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. ఈ ప్రభావం మనదేశంలోనూ ఉంది. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్ పడిపోయింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ దారుణంగా పడిపోయింది. భారత్లో గత కొన్నాళ్లుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. చైనాలో అయితే ఏకంగా 18 నెలలుగా సేల్స్ పెరగడం లేదు. భారత్లో ఆటో, రియల్, ఎఫ్ఎంసీజీ వంటి వివిధ రంగాలపై ప్రభావం పడింది. దీంతో జీఎస్టీ రెవెన్యూ కూడా తగ్గుతోంది. మందగమనం ప్రభావం దక్షిణాది రాష్ట్రాల రెవెన్యూపై కూడా పడుతోంది.
జీఎస్టీ భారం మరో 3 శాతం: రాష్ట్రాల ఒత్తిడి, సెస్ పెంచనున్న కేంద్రం?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మందగమనం దెబ్బ
మందగమనం కారణంగా దక్షిణాదిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఈ ఏడాది భారీగా తగ్గిపోయింది. ఆయా సమయాల్లో గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది అదే సమయంలో వచ్చిన రెవెన్యూ తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి, గత ఏడాది అక్టోబర్ నాటికి పోలిస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ 5 శాతం తగ్గింది.
అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే దారుణం
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG)కు సమర్పించిన నివేదిక ప్రకారం... ఆంధ్రప్రదేశ్లో గత అక్టోబర్ నాటితో పోలిస్తే, ఈ అక్టోబర్ నాటికి 18 శాతం రెవెన్యూ తగ్గింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే రెవెన్యూ వరస్ట్గా ఉంది.
48 శాతం లక్ష్యం మాత్రమే చేరుకుంది
బడ్జెట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుందని అంచనా వేసిన దాని కంటే ఈ ఏడాది అక్టోబర్ నాటికి 48 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకుంది. అదే సమయంలో గత ఏడాది బడ్జెట్ అంచనాలో 58.17 శాతం లక్ష్యానికి చేరుకుంది.
తెలంగాణలో....
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా తెలంగాణ ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. కానీ ఆంధ్రప్రదేశ్ కంటే చాలా మెరుగు. హైదరాబాద్ వంటి అతి పెద్ద నగరం ఉన్నప్పటికీ గత ఏడాది అక్టోబర్ నాటితో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం రెవెన్యూ ఫాల్ కనిపిస్తోంది. బడ్జెట్లో అంచనా వేసిన దాని కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఏడాది 60 శాతం రెవెన్యూ నమోదు చేసింది. గత ఏడాది 66 శాతం లక్ష్యాన్ని చేరుకుంది.
కర్ణాటక బెస్ట్.. హైదరాబాద్ వైపు చూపు
దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల విషయాన్ని తీసుకుంటే కేరళలో 8 శాతం తగ్గింది. గత ఏడాది అక్టోబర్ నాటికి 53 శాతం ఉండగా, ఈ ఏడాది 45 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు కలెక్షన్స్ బాగున్నాయి. గత ఏడాది 58 శాతంగా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 47 శాతంగా ఉన్నాయి. 11 శాతం తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కలెక్షన్స్ గత ఏడాది కంటే అతి తక్కువగా తగ్గిన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ముందుంది. కన్నడనాట కేవలం 4 శాతమే తగ్గింది. గత ఏడాది అక్టోబర్ నాటికి 57 శాతం కాగా, ఈ ఏడాది 53 శాతంగా ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కే నరసింహ మూర్తి మాట్లాడుతూ.. తెలంగాణకు హైదరాబాద్ ఎంతో కీలకమని, ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఈ నగరం వైపు చూస్తున్నారని చెప్పారు.