కోటి ఆశలతో వస్తే షాక్.. ఆఫర్ లెటర్లు వెనక్కి! పరిస్థితి మరీ భయానకంగా ఉందా అంటే?
కరోనా మహమ్మారి కారణంగా ఉత్పత్తి-డిమాండ్ పడిపోయాయి. అన్ని రంగాలు కూడా ఆర్థికంగా చితికిపోతున్నాయి. చిన్న చిన్న కంపెనీల నుండి భారీ కంపెనీల వరకు ఉత్పత్తి నిలిచిపోయి, డిమాండ్ లేక నష్టపోతున్నాయి. ఐటీ వంటి సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అలాంటి వెసులుబాటు లేని సంస్థలకు నష్టం మరింత ఎక్కువగా ఉంది. బిజినెస్ నెమ్మదించడంతో వివిధ సంస్థలు ఇటీవల ఇచ్చిన ఆఫర్ లెటర్స్ను విత్ డ్రా చేసుకోవడం లేదా ఫ్రీజ్ చేయడం చేస్తున్నాయి.
కోటి ఆశలతో వచ్చిన వారికి షాక్
కరోనా దెబ్బకు చాలా సంస్థలు ఇటీవలి కాలంలో జారీ చేసిన ఆఫర్ లెటర్స్ను వాయిదా వేయడం లేదా ఉపసంహరించుకోవడం చేస్తున్నాయి. కోటి ఆశలతో ఆఫర్ లెటర్స్ తీసుకున్న ఫ్రెషర్స్కు ఇప్పుడు కంపెనీలు షాకిస్తున్నాయి. కరోనా దెబ్బతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కంపెనీలు వాటిని ఫ్రీజ్ చేస్తున్నాయి. నియామకాలు వాయదా వేయడం లేదా ఉపసంహరించడం కేవలం ప్రెషర్స్ విషయంలోనే కాదు.. తమ కంపెనీలోకి తీసుకోవాలనుకున్న సీనియర్ ఎగ్జిక్టూటివ్ ఆఫర్లపై కూడా ఈ ప్రభావం పడింది. గత వారం పది రోజుల్లో ఎక్కువగా కనిపించిందని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీలు చెబుతున్నాయి.
వారం, పది రోజుల్లో ఇలాంటివి..
నియామక ఆఫర్లను నిలిపేయడం లేదా ఉపసంహరించుకుంటున్నాయని, గత వారం పది రోజుల్లో ఇలాంటివి జరిగినట్లు గుర్తించామని ఎగ్జిక్యూటివ్ యాక్సెస్ ఇండియా ఎండీ వెల్లడించారు. గత పది రోజుల్లో ఇలాంటివి గమనించామని, బిజినెస్ భారీగా పడిపోవడం వల్ల 5 కేసులు ఇలాంటివి చూశామని, మరో బాధాకరం ఏమంటే ఇందులో ఇప్పటికే ఇద్దరు కంపెనీతో కలిశారని మరో నిపుణులు చెప్పారు.
నియామక ప్రక్రియ నిలిపివేత
లాక్ డౌన్ కారణంగా ఆదాయం భారీగా తగ్గిపోవడంతో ఇండియన్ టెక్ కంపెనీలు నియామక ఆఫర్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు నియామక ఆఫర్లను గౌరవించలేని పరిస్థితి అని చెబుతున్నారు. చాలా కంపెనీలు నియామక ప్రక్రియనే నిలిపివేస్తున్నాయని చెబుతున్నారు.
మరీ అంత భయానకంగా లేదు కానీ
తాను వివిధ కంపెనీలతో మాట్లాడుతున్నానని, ఆఫర్ లెటర్స్ వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారని, తాను వీటికి సంబంధించి 30 నుండి 40 ఆఫర్లు వాయిదా పడినట్లు విన్నానని బీటీఐ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఎండీ జేమ్స్ అగర్వాల్ చెప్పారు. అయితే పరిస్థితి మరి భయానకంగా ఏమీ లేదన్నారు. సైబర్ సెక్యూరిటీ, లీగల్, ఫైనాన్స్, కంప్లియెన్స్, డిజిటల్, ఆటోమేషన్ రంగాల్లో ప్రతిభకు డిమాండ్ ఉందని చెప్పారు.
ఆదాయంపై ప్రభావం
కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితులతో నియామక ప్రక్రియ నిలిచిపోవడం హైరింగ్ ఏజెన్సీల ఆదాయాన్ని ప్రభావితం చేసింది. పేమెంట్స్ పొడిగించినట్లు క్లయింట్స్ నుండి సమాచారం వస్తోందని, నాలుగు నుండి ఆరు నెలలు సమయం పట్టవచ్చునని, ఇదే ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు.