ఆర్థిక మందగమనం, నిర్మలా సీతారామన్ బడ్జెట్: ఇలా చేయండి....
ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశ పెడుతున్న బడ్జెట్ వైపు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేసే ఊరట ప్రకటనలు ఏమిటి.. ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అనేది ప్రశ్నగా మారింది. ఈ సమయంలో ఆర్థిక ప్రగతిని పరుగు పెట్టించేందుకు ఆర్థిక నిపుణులు వివిధ మార్గాలు సూచిస్తున్నారు. ఇందులో కొన్ని...
వేతనజీవులకు షాక్: మందగమనం ఎఫెక్ట్, ఆదాయపు పన్ను ఊరట లేనట్లే!
పట్టు విడుపులు అవసరం
ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంచనాలకు మించి ప్రమాదకరంగా ఉందని, కాబట్టి వృద్ధిరేటు బలోపేతంపై మొదట దృష్టి సారించాలని, నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో సరికావని అంటున్నారు. బడ్జెట్ అంచనాల్ని సాధించేందుకు వృద్ధిదాయక చర్యలకు విఘాతం కలిగించవద్దని చెబుతున్నారు. జీడీపీ గాడిన పడేవరకు కాస్త పట్టు విడుపులు ఉండాలని సూచిస్తున్నారు.
ఆదాయపు పన్నును తగ్గించాలి
ఆదాయపు పన్నును తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరుగుతుందని, అప్పుడు మార్కెట్లోకి ద్రవ్య పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.
రుణ వితరణ పెరగాలి
మార్కెట్లోని స్తబ్దతను తొలగించేందుకు వ్యాపార, పారిశ్రామిక రంగాలకు రుణాల వితరణ పెరగాలని సూచిస్తున్నారు. NBFC సంక్షోభం కారణంగా రుణ వితరణ అనివార్యమని చెబుతున్నారు. NBFC అండగా ఉండాలంటున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ
వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఖజానాకు నిధుల ప్రవాహం పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
డివిడెండ్ ట్యాక్స్ తగ్గింపు
దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్లను తగ్గించాలని సూచిస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు. ఇన్వెస్టర్ల నుంచి దేశ, విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని చెబుతున్నారు.
మౌలిక రంగాలు
మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్ద పీట వేయాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ వంటి వాటికి మరిన్ని నిధులు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, వినియోగం పెంచాలని సూచిస్తున్నారు.