కంపెనీలో ఆర్థిక అవకతవకలు: భారత్కు చెందిన సీఈఓకు ఉద్వాసన
ముంబై: ప్రపంచవ్యాప్తంగా పలు మల్టీ నేషనల్ కంపెనీలకు భారతీయులు, భారత సంతతికి చెందిన వారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా పని చేస్తోన్నారు. టాప్ సెర్చింజిన్ గూగుల్, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్.. వంటివి ఈ జాబితాలో చాలా ఉన్నాయి. కొన్ని ఆన్లైన్, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్కు సారథ్య బాధ్యతలను వహిస్తున్నారు. ఇలాంటి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి.
ఇందులో ఒకటి సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తోన్న బీ2బీ కంపెనీ జిలింగో. ఫ్యాషన్ సెగ్మెంట్కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ ఇది. భారత్కు చెందిన అంకితి బోస్.. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పని చేస్తోన్నారు. ఇప్పుడు ఆమె ఉద్వాసనకు గురయ్యారు. జిలింగో యాజమాన్యం ఆమెను తొలగించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో అంకితి బోస్కు ఉద్వాసన పలికింది.
ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలియడంతో మార్చి 31వ తేదీ నాడే అంకితి బోస్ను సస్పెండ్ చేసింది జిలింగో యాజమాన్యం. ఈ వ్యవహారంపై ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ గ్రూప్తో దర్యాప్తు చేయించింది. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్పై క్షుణ్నంగా దర్యాప్తు జరిపించింది. దీనికి సంబంధించిన నివేదికపై ఈ నెల 11వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో చర్చించింది. ఆర్థికంగా కొన్ని లోపాలు, దుర్వినియోగం చోటు చేసుకున్నట్లు తేలినట్లు నిర్ధారించింది.
సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంకితి బోస్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అంకితి బోస్ను సస్పెండ్ చేస్తూ ఇదివరకే జారీ చేసిన ఉత్తర్వులను తొలగింపుగా బదలాయించింది. ఆమెను సంస్థ నుంచి తొలగించినట్లుగా తాజాగా వెల్లడించింది. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని అంకితి ఇదివరకే వెల్లడించారు. జిలింగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు లీగల్ నోటీసులను కూడా పంపించారు.