ఈసారి భారత జీడీపీ సున్నా, ప్రపంచ వేగవంత ఆర్థిక వ్యవస్థగా..: మోడీతో నిర్మల భేటీ
భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, అయితే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ప్రతికూలంగా లేదా సున్నాగా నమోదు కావొచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచే అంశంపై సమీక్షించారు. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ద్వారా డిమాండ్ చర్యలు తీసుకున్నారు.
గతంలో రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈసారి మరో ప్యాకేజీపై చర్చలు జరుగుతోన్న సమయంలో ప్రధాని-ఆర్థికమంత్రి భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, మంగళవారం సెరావీక్ 4వ వార్షిక ఇండియా ఎనర్జీ ఫోరంలో నిర్మలమ్మ మాట్లాడారు.
రూపే కార్డు వినియోగదారులకు గుడ్న్యూస్! 65% వరకు భారీ డిస్కౌంట్, ఆఫర్లు
వేగవంత ఆర్థిక వ్యవస్థల్లో భారత్
ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని, అయినప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ నెగిటివ్ లేదా జీరోగా ఉండవచచునని నిర్మలమ్మ అన్నారు. అన్-లాక్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నెగిటివ్గా ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు వేగవంతమవుతుందని, ప్రపంచ వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారత ఆర్థిక పునరుజ్జీవం స్థిరంగా కనిపిస్తోందన్నారు. ఈ పండుగ సీజన్ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని, మూడు, నాలుగో త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ భేష్
భారత జీడీపీ మూడో త్రైమాసికంలో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 25 నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించడాన్ని నిర్మల సమర్థించారు. లాక్ డౌన్ వల్ల కరోనాపై పోరాటానికి అందరికీ సమయం కూడా దొరికిందని అభిప్రాయపడ్డారు. అన్-లాక్ తర్వాత కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని మోడీ ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది.
FDI ప్రవాహం
గ్రామీణ రంగం బాగా పని చేస్తోందని, ఆటో అమ్మకాలు మంచివృద్ధిని సాధించాయని నిర్మల అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ప్రవాహం 2019 ఏప్రిల్-ఆగస్ట్ కాలంతో పోలిస్తే 2020 ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో 13 శాతం వృద్ధిని సాధించిందన్నారు. ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ప్రభుత్వ వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దేశీయ ఇంధన అవసరాల అంశంపై నిర్మల స్పందించారు. సమర్థమైన గ్యాసిఫికేషన్ భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందన్నారు. జీవ ఇంధనాల సమర్థ వినియోగాన్ని దేశం చూస్తోందని, అణుశక్తి కోసం ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు.