ఇండియా కు మేలు చేయదు: చైనా ఉత్పత్తుల బహిష్కరణపై చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పరోక్ష వ్యాఖ్య
సరిహద్దుల్లో చైనా సైన్యం చేసిన దాష్టీకంతో దేశం మొత్తం ఉడికిపోతోంది. మన సైనికుల త్యాగం ఊరికే పోగూడదని, ప్రతీకారంగా చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు ముక్త కంఠంతో నినాదాలు చేస్తున్నారు. ఈ దిశగా అటు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ, ఇలాంటి నిర్ణయాలు భారత్ కు మేలు చేయబోవని ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మమనియణ్ వ్యాఖ్యానించారు.
ఇండియా 1991 వరకు దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలనే అవలంభించిందని, తద్వారా మనకు మేలు జరగలేదని వెల్లడించారు. 'ఇతర దేశాలతో ఇండియా పోటీ పడాల్సిందే. వాటి నుంచి దూరంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు' అని అయన కుండబద్దలు కొట్టారు. కోల్కతా లో ఎం సి సి ఐ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక వెబినార్ లో కృష్ణమూర్తి మాట్లాడారు. ఆ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
నిబంధలకు లోబడి.. భారత్ ప్లాన్: చైనా సహా ఆ దేశాలకు యాంటీ డంపింగ్ డ్యూటీ షాక్
వాటికి మినహాయింపు...
పరోక్షంగా చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేయటం వల్ల భారత్ కు ప్రయోజనం లేదని స్పష్టం చేసిన ముఖ్య ఆర్థిక సలహాదారు... కానీ కొన్ని సార్లు మాత్రం వాటికి మినహాయింపులు ఉంటాయని వ్యాఖ్యానించారు. 'నేను ఆ మాట చెబుతున్నప్పటికీ .. వాటికీ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సరిహద్దుల్లో సమస్యలు సృష్టించే దేశంతో కూడా వర్తకం చేయాలని నేను చెప్పటం లేదు' అని వివరణ ఇచ్చారు.
దేశమంతా చైనా కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పడు అయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక వైపు పరోక్షంగా చైనా కు అనుకూల వ్యాఖ్యలు చేస్తూనే మరో వైపు అవసరమైతే అలాంటి దేశాలతో వర్తకం నిలిపివేయవచ్చు అని అయన చెప్పటం గమనార్హం. అయన వ్యాఖ్యలు అందరికి ఎలా అర్థమైనప్పటికీ ... నిపుణులు, విశ్లేషకులకు మాత్రం అవి మరోలా కనిపిస్తున్నాయి.
అసలు అర్థం అదే...
విదేశీ వస్తువుల బహిష్కరణ వల్ల దేశం పెద్దగా లాభ పడదు అని అయన చెప్పదలచుకున్నారు. అది చైనా వస్తువులకు కూడా వర్తిస్తుంది. కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అతిపెద్ద చర్చనీయ అంశం కూడా అదే. అందుకే అయన దానిపై కుండబద్ధలు కొట్టారు. కృష్ణమూర్తి సుబ్రమణియన్ సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ కి ముఖ్య ఆర్థిక సలహాదారు. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ విధానాలు, పథకాలు ఎలా ఉండాలన్న అంశాలపై అయన సలహాలనే ప్రధాని పాటిస్తారు.
కాబట్టి, అయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఆలోచన ధోరణని స్పష్టం చేస్తాయి. అంటే, ప్రస్తుతం ఎవరెన్ని మాట్లాడినా... చైనా వస్తువుల ను వెంటనే బాన్ చేసే ఎలాంటి అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని తేలిపోయింది. ఈ విషయాన్నీ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు పసిగట్టేశారు.
ఏ విధానమూ పనిచేయదు...
ప్రస్తుతం దేశం, ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం ఆర్థిక అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోంది. కానీ, ఇందులో నుంచి వ్యవస్థను బయట పడేయాలంటే, డిమాండ్ సృష్టించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలాంటి విధానం కూడా పని చేయదని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో ప్రజలు అనవసరమైన వస్తువుల కొనుగోళ్ళకు దూరంగా ఉంటారని, కేవలం అత్యవసర వస్తువుల కొనుగోళ్ళకు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. సరిగ్గా ఇదే సూత్రం కంపెనీలకు కూడా వర్తిస్తుందని అయన చెప్పారు. ఈ పరిస్థితి ఆరోగ్య పరమైనది కాబట్టి, కోవిడ్ -19 కు వాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడే బహుశా అది సమిసిపోతుందని తెలిపారు.
దేశంలోని చిన్న, మధ్యతరహా సంస్థల కు ద్రవ్య లభ్యత కు ఢోకా లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. కాబట్టి, పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి చూడాల్సిందే తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన పరోక్ష వ్యాఖ్య చేసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.