ఈ వెబ్సైట్ల నుండి కొనుగోలు చేస్తున్నారా... ఐతే జాగ్రత్త! 50% ధరాభారం
విదేశీ ఈ-కామర్స్ సైట్ల ద్వారా మీరు కొనుగోళ్లు చేస్తున్నారా? అయితే ఇది మీకు భారం కానుంది. క్రాస్-బార్డర్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ప్రీపెయిడ్ ట్యాక్స్, కస్టమ్ మోడల్పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ద్వారా విదేశీ ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం వరకు భారం పడనుంది.
క్రెడిట్ కార్డు తీసుకుంటే ఎప్పుడు లాభం, ఎన్ని ఉండాలి?
సుంకాలు, పన్ను ఎగవేత అరికట్టేందుకు
ఈ షాపింగ్ పోర్టల్స్లో ట్రాన్సాక్షన్ సుంకాలు, పన్ను ఎగవేత వంటి ఉదంతాలు చోటు చేసుకుంటుండటంతో కేంద్రం మరింతగా దృష్టి సారించింది. క్రాస్-బార్డర్ ట్రాన్సాక్షన్స్పై ప్రీ-పెయిడ్ విధానంలో కస్టమ్స్ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అప్పుడే వస్తువుల పంపిణీ
ఈ విధానం అమల్లోకి వస్తే విదేశీ ఆన్లైన్ షాపింగ్ సైట్ల ద్వారా జరిపే కొనుగోళ్లు దాదాపు 50 శాతం వరకు భారం అవుతాయని అంచనా. ఈ మోడల్ కింద ఏ విదేశీ ఈ-కామర్స్ వెబ్ సైట్ అయినా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఐటీ వ్యవస్థ ద్వారా పన్నులు, కస్టమ్స్ సుంకం చెల్లించిన తర్వాతే వస్తువులను పంపిణీ చేస్తుంది.
గిఫ్టుల రూపంలో దిగుమతులపై నిషేధం
చైనాకు చెందిన వివిధ ఈ-కామర్స్ వెబ్ సైట్లు కస్టమ్స్ డ్యూటీని, జీఎస్టీని ఎగవేసిన విషయం గత ఏడాది వెలుగు చూసింది. దీంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ముంబై పోర్ట్ నుండి గిఫ్టుల ద్వారా వచ్చే నగదు దిగుమతులపై కస్టమ్స్ విభాగం నిషేధం విధించింది. కోల్కతా, చెన్నై పోర్టులలో కూడా దీనిని అమలు చేయాలని చూస్తోంది.
ఇలా పన్నుల ఎగవేత
భారతీయులకు విదేశాల నుంచి వచ్చే గిఫ్టుల విలువ రూ.5,000 వరకు అయితే పన్ను భారముండదు. దీనిని ఆసరాగా చేసుకుని పలు చైనీస్ ఈ-కామర్స్ సైట్లు.. భారతీయులు కొనుగోలు చేసిన ఉత్పత్తులను బహుమతుల పేరిట ఎగుమతి చేస్తున్నాయి. దీంతో సుంకాలు, పన్నుల్లో ఎగవేత చోటు చేసుకుంటుంది.
అందుకే భారీగా తగ్గింపు ధరకు..
వివిధ ఉత్పత్తులపై భారీగా ఉండే సుంకాల భారం తగ్గడంవల్ల దేశంలోని ఈ-కామర్స్ పోర్టల్స్తో పోలిస్తే విదేశీ షాపింగ్ పోర్టల్స్ నుండి కొనుగోలు చేసే ఉత్పత్తులు దాదాపు నలభై శాతం వరకు తక్కువగా లభిస్తున్నాయి. గిఫ్ట్ విధానాన్ని విదేశీ పోర్టల్స్ దుర్వినియోగం చేస్తుండటంతో దేశీయ సంస్థలకు నష్టం జరుగుతోంది. దీంతో దీనిపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంది.
కేంద్రం సవరణలు
గిఫ్టుల రూపంలో వచ్చే దిగుమతులపై ముంబై కస్టమ్స్ విభాగం నిషేధం తర్వాత అరవై శాతం వరకు కొనుగోళ్లు పడిపోయాయి. అవసరమైన రాఖీలు, ఔషధాలు మినహా ఇతర వస్తువులు గిఫ్ట్ల రూపంలో వచ్చే వాటిపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో కేంద్రం సవరణలు చేసింది.