ఆర్బీఐ ఆదేశాలు వెంటనే అమలు చేయాలి: బ్యాంకులకు శక్తికాంతదాస్
కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తోన్న సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంతదాస్ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎండీలు, సీఈవోల సమావేశంలో అన్నారు. ఒడిదుడుకులు తట్టుకునేలా బ్యాంకు బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపై దృష్టి సారించాలన్నారు. సవాళ్లు ఎదుర్కోనేటప్పుడు వ్యక్తులకు, వ్యాపారాలకు రుణ సదుపాయాలతో సహా వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలను విస్తరించడంలో PSBలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయన్నారు.
త్వరగా అమలు..
ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన చర్యలను త్వరగా అమలు చేయాలని శక్తికాంత దాస్ సూచించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో అత్యవసర ఆరోగ్య సేవల కోసం, ఎంఎస్ఎంఈ రంగానికి రుణ పునర్నిర్మాణం కోసం రూ.50వేల కోట్ల టర్మ్ లిక్విడిటీ సదుపాయం ప్రకటించారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బ్యాంకర్లతో మాట్లాడిన అనంతరం ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
గవర్నర్ ప్రశంస
దేశ ప్రస్తుత ద్రవ్య-ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణగ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(MSME)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కరోనా రిజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ వంటి అంశాలు వీడియో కాన్ఫరెన్స్లో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపై చర్చ జరిగింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను తన గవర్నర్ ప్రశంసించారు.
ఆర్బీఐ చర్యలు
కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో మే నెల మొదటి వారంలో ఆర్బీఐ పలు చర్యలను ప్రకటించింది. వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆసుపత్రులు, ల్యాబ్స్కు రుణాలు, రాష్ట్రాల ఓవర్ డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ-సెక్ల కొనుగోలు వంటి పలు చర్యలు వీటిలో ఉన్నాయి.