ఎయిర్ ఇండియాకు వరుస షాకులు: మొన్న దుబాయ్, నేడు హాంకాంగ్ లో విమాన సర్వీసులు నిషేధం
ఎయిర్ ఇండియా లిమిటెడ్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటించని కారణంగా విమాన సర్వీసులపై నిషేధం విధిస్తున్న పరిస్థితి ఎయిర్ ఇండియా కు తలనొప్పిగా మారుతుంది. మొన్నటికి మొన్న దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యొక్క అన్ని కార్యకలాపాలను 15 రోజుల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంటే తాజాగా హాంకాంగ్ కూడా అదే బాటలో ఎయిర్ ఇండియా పై నిషేధం విధించి షాక్ ఇచ్చింది.
కరోనా నిబంధనల ఉల్లంఘనతో ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ లో నిషేధం
హాంగ్ కాంగ్ కూడా కరోనా నియమాలను ఉల్లంఘించి కరోనా పాజిటివ్ వ్యక్తులను చేరవేసినందుకు ఎయిర్ ఇండియా విమాన కార్యాకలాపాలపై నిషేధం విధించింది . గతంలో ఒకసారి ఇదే విధంగా నిషేధానికి గురైన ఎయిర్ ఇండియా ఇప్పుడు రెండో సారి కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు నిషేధానికి గురైంది. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు రెండు వారాలు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను హాంకాంగ్ నిషేధించింది.
గతంలోనూ ఒకసారి ఆగస్ట్ లో నిషేధం .. ఇప్పుడు రెండో సారి .. రీజన్ అదే
రెండు వారాల్లో ఒకే ఒక విమాన షెడ్యూల్ ఉంది. సెప్టెంబర్ 21న నేడు ఢిల్లీ -హాంకాంగ్ విమానం వెళ్ళాల్సి ఉండటంతో ఆ ఫ్లైట్ రద్దు చేయబడింది . దీనిపై ప్రయాణికులకు సమాచారం అందించారు .గతంలో కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేసిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడంతో ఆగస్టు 18వ తేదీన హాంకాంగ్ ఎయిర్ ఇండియా విమానాలు ఆగస్టు 31 వరకు సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరోమారు హాంకాంగ్ సివిల్ ఏవియేషన్ కఠిన నిర్ణయం తీసుకుంది .
కరోనా పాజిటివ్ ప్రయాణికులను చేరవేసినందుకే
ఈనెల 18వ తేదీన హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు కరోనా బారిన పడ్డారు. వీరంతా కాధే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుండి హాంకాంగ్ వెళ్ళినట్లుగా తేలింది. వారంతా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తో ప్రయాణం చేసినప్పటికీ, వారికి అక్కడ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సీరియస్ గా తీసుకున్న హాంకాంగ్ సివిల్ ఏవియేషన్ అధారిటీ రెండు వారాల పాటు ఎయిర్ ఇండియా విమానాలు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. జూలైలో హాంకాంగ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం, ప్రయాణానికి 72 గంటలలోపు చేసిన పరీక్ష నుండి కరోనా నెగటివ్ సర్టిఫికేట్ ఉంటేనే భారతదేశం నుండి ప్రయాణీకులు హాంకాంగ్ ప్రయాణించవచ్చు.
మొన్ననే దుబాయ్ సివిల్ ఏవియేషన్ షాక్ .. 15 రోజులు విమానాలపై సస్పెన్షన్
మొన్నటికి మొన్న కరోనా నియమాలను ఉల్లంఘించినందుకు , కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని దుబాయ్ కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో తీసుకువెళ్ళినందుకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ దుబాయ్ లో ఎయిర్ లైన్స్ ఆపరేషన్ ను సెప్టెంబర్ 18 నుండి 15 రోజుల పాటు నిలిపివేసింది . కోవిడ్ -19 సోకిన ప్రయాణీకుడిని రెండవ సారి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ఒకసారి కోవిడ్ పాజిటివ్ ఉన్న ప్రయాణికుడిని తీసుకు వెళ్ళిన ఇండియన్ ఎయిర్ లైన్స్ రెండవ సారి కోవిడ్ -19 పాజిటివ్ ప్రయాణీకుడిని తీసుకువెళ్లటం , కరోనా నిబంధనలను పాటించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో నిర్ణయం తీసుకుంది.
రెండు దేశాల్లో నిషేధం .. నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లిస్తున్న ఎయిర్ ఇండియా
దుబాయ్ లో ఇప్పటి వరకు రెండు సార్లు , ఇప్పుడు హాంకాంగ్ లోనూ రెండుసార్లు కరోనా పాజిటివ్ లను చేరవేసినందుకు ఎయిర్ ఇండియా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల అటు దుబాయ్ లోనూ, ఇటు హాంకాంగ్ లోనూ విమాన కార్యకలాపాలపై నిషేధానికి గురైంది. వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియా వివిధ దేశాలకు చెందిన వారిని చేరవేయడానికి విమాన సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే.