కరోనా ఎఫెక్ట్, బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
2020 క్యాలెండర్ ఏడాది అంతా కరోనా మహమ్మారితోనే సరిపోయింది. ఈ వైరస్ భయాలు ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఆరోగ్యంపై ముందు జాగ్రత్త వహిస్తున్నారు. అందుకే హెల్త్ పాలసీలు పెరుగుతున్నాయి. కరోనా నుండి నేర్చుకున్న పాఠాలతో ప్రపంచ దేశాలు ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాయి. ఈ వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం రానున్న బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
వైద్యరంగానికి విడిగా నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. దానిని ప్రధానమంత్రి స్వాస్థ్ సంవర్ధన్ నిధి పేరుతో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. వైద్యరంగంలో ఎలాంటి విపత్తుల్ని అయినా ఎదుర్కొనేందుకు బడ్జెట్ కేటాయింపులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో ఈ కీలక ప్రతిపాదనపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి స్వాస్థ్ సంవర్ధన్ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని పూర్తిగా వాడకపోయినప్పటికీ అలాగే కొనసాగించేలా రూపొందించారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుపై విధించే విద్య, ఆరోగ్య సెస్ వసూళ్లలో 25% ఈ నిధికి కేటాయిస్తారు. వీటిని ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు, ప్రధానమంత్రి స్వాస్థ్ సంవర్ధన్ నిధి పథకాలకు వినియోగిస్తారు.