భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 870 పాయింట్లు పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 5) భారీ నష్టాల్లో ముగిశాయి. ఓ సమయంలో 1300 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్ చివరకు 870 పాయింట్ల నష్టంతో ముగిసింది. కరోనా భయాలు మార్కెట్లను నిండా ముంచాయి. దేశంలో మళ్లీ కరోనా భారీ స్థాయిలో వ్యాపిస్తుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నుండి ప్రతికూలంగానే కదలాడాయి. ఏ దశలోను కోలుకున్న పరిస్థితి కనిపించలేదు. నష్టం మాత్రమే కాస్త తగ్గింది.
ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు గడుస్తున్నకొద్దీ అంతకంతకు దిగజారాయి. ఉదయం సెన్సెక్స్ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ దశలో సెన్సెక్స్ 1,449 పాయింట్లు కుంగి 48,580 వద్ద, నిఫ్టీ 408 పాయింట్లు కోల్పోయి 14,459 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో దాదాపు రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కనిష్ఠాల నుండి సూచీలు కోలుకున్నట్లు కనిపించినా అంతంత మాత్రమే. అప్పటికీ భారీ నష్టాల్లోనే ఉన్నాయి. చివరకు సెన్సెక్స్ 870 పాయింట్ల నష్టంతో 49,159 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు కోల్పోయి 14,637 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 73.33 వద్ద స్థిరపడింది.