గ్లోబల్ మార్కెట్స్ Vs భారత్-చైనా ఉద్రిక్తత: భారీగా ఎగిసి... స్వల్ప లాభాలతో క్లోజ్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం వంటి వివిధ కారణాల వల్ల సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 33,605 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు ఎగిసి 9,914 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి 76.21 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఉదయం దాదాపు 800 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 230 పాయింట్లకు పైగా పెరిగింది. ఓ దశలో నిఫ్టీ 10వేల మార్క్ దాటింది.
ఇన్సైడర్ ట్రేడింగ్: రాకేష్ ఝున్ఝున్వాలాకు సెబి నోటీసులు
అందుకే తొలుత భారీ లాభాల్లో...
కరోనా నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కార్పోరేట్ బాండ్స్ కొనుగోలు ప్రకటన చేయడం, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగడం, కరోనా మహమ్మారి రెండోసారి విజృంభన భయాలు కాస్త తగ్గడం వంటి వివిధ కారణాలతో మార్కెట్ సెంటిమెంటు బలపడింది. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం తొలుత మార్కెట్ పైన కనిపించింది. దీంతో సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా ఎగిసింది.
భారత్ - చైనా ఉద్రిక్తతలు
ఆ తర్వాత భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఓ దశలో ఇంట్రాడేలో 34,022 గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 32,953 పాయింట్లకు పడిపోయింది. తొలుత భారత సైనికులు మాత్రమే అమరులైనట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చైనాకు కూడా ప్రాణనష్టం జరిగినట్లుగా తెలిసింది.
అయితే కరోనా సహా అన్ని విషయాల్లోను దాపరికం చూపే చైనా తమ సైనికులు ఎంతమంది చనిపోయారో చెప్పలేదు. ఆ తర్వాత మార్కెట్ భారీ నష్టాల్లోకి వెళ్లి ఆ తర్వాత స్వల్ప లాభాలతో ముగిసింది. భారత్ - చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత సెన్సెక్స్ 275 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయింది.
టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, జేఎస్డబ్ల్యు స్టీల్, హిండాల్కో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, గెయిల్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి. మొత్తంగా సెన్సెక్స్ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దాదాపు 800 పాయింట్లు పెరిగినప్పటికీ, ఆ తర్వాత అమెరికా - చైనా ఉద్రిక్తతలు అంతేస్థాయిలో నష్టపరిచాయి. చివరకు కొద్ది లాభాలతో ముగిశాయి.