అమంగళవారం: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్: లాభపడ్డ పేటీఎం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ అనూహ్యంగా పతనమైంది. సోమవారం నాడు 1,000 పాయింట్లతో పైగా లాభాలతో ముగిసిన ట్రేడింగ్.. ఇవ్వాళ ఊహించని విధంగా నష్టాలతో సాగుతోంది. ఇన్వెస్టర్లకు అమంగళవారంలా మారింది. తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. మైనస్లల్లో పడిపోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్ల పరిస్థితీ ఇంతే. ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
తొలి గంటలోనే 500 పాయింట్లకు పైగా నష్టపోయింది సెన్సెక్స్. ఆరంభంలోనే 300 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ మొదలైంది. రెడ్ జోన్లో ట్రేడింగ్ అవుతూ వచ్చింది. సమయం గడుస్తోన్న కొద్దీ షేర్లన్నీ మైనస్లోకి వెళ్లిపోవడం కనిపించింది. ఏ దశలో కూడా అప్పర్ సర్కుట్కు చేరుకోలేకపోయింది. తొలి గంట ముగిసే సమయానికి 55,608 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.
నిఫ్టీ కూడా ఇదేరకమైన పతనాన్ని చవి చూసింది. తొలి గంటలో 100 పాయింట్లను నష్టపోయింది. 16,500 పాయింట్లకు దిగువగా ట్రేడింగ్ నమోదు చేసుకుంది. సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, కోటక్ బ్యాంక్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీల షేర్లు నష్టపోయాయి. రెండు నుంచి మూడు శాతం మేర ఆయా కంపెనీల షేర్ల రేట్లు పడిపోయాయి. పవర్ గ్రిడ్, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా స్టీల్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ షేర్లు కొంత మేర లాభపడ్డాయి.
పేటీఎం, వొడాఫోన్ ఐడియా షేర్లు లాభపడ్డాయి. వొడాఫోన్ ఐడియాలో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 20,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో- వాటి షేర్లల్లో కదలిక ఏర్పడిన విషయం తెలిసిందే. సోమవారం అయిదు శాతం మేర ఆ కంపెనీ షేర్ల ధరలు పెరగ్గా.. ఇవ్వాళ అదే దూకుడు కొనసాగుతోంది. నిఫ్టీలో టాటా మోటార్స్, హిండాల్కో, అపోలో హాస్పిటల్స్.. నష్టపోయాయి. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండైసెస్ అన్నీ 2.2 శాతం మేర నష్టాలను చవి చూశాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్.. ఇలా అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్లన్నీ రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి. వోల్టాస్ షేర్లు- ఏకంగా ఏడు శాతం మేర నష్టపోయాయి. విప్రో 52 వారాల తరువాత కనిష్ఠాన్ని నమోదు చేసుకుంది.